చంద్రబాబు ఆఫర్ తిరస్కరించిన ఎంపీ కేశినేని నాని ... ఆ పదవి అక్కర్లేదని పోస్ట్
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ఫలితాలతోనే కాదు సొంత పార్టీ నేతల తీరుతోనూ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. అసలే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబుకు సొంత పార్టీ నేతలు షాక్ లు ఇస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు తీరుతో చాలా అసంతృప్తిలో ఉన్నారు.
వైసీపీ పార్లమెంటరీ నేతగా విజయసాయి రెడ్డి .. లోక్ సభా పక్ష నేతగా మిథున్ రెడ్డికి అవకాశం
చంద్రబాబు ఆఫర్ కు నో చెప్పిన ఎంపీ కేశినేని నాని
టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు తనకు ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పారు. చంద్రబాబు కేశినేని నానీకి పార్టీ విప్ గా అవకాశం ఇచ్చారు. అయితే నానీ చంద్రబాబు ఇచ్చిన పదవిని నిరాకరించారు . లోక్సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్దేవ్ను , అలాగే లోక్సభ ఫ్లోర్ లీడర్గా రామ్మోహన్నాయుడిని, పార్టీ విప్గా కేశినేని నానిని నియమించారు చంద్రబాబు.దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన నాని.. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
విప్ పదవి నిర్వహించేంత సమర్దుడిని కాదని ఫేస్ బుక్ లో పోస్ట్
పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ వ్యాఖ్యానించారు.తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాలంటూ తానూ రాసిన పోస్ట్ లో పేర్కొన్నారు . పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు . మరోసారి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నా అంటూ నాని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అలాగే గత కొంతకాలంగా నాని బీజేపీలో చేరుతున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. తనకు బీజేపీ అవసరం లేదని.. ఆ పార్టీలో చేరడం లేదని నాని స్పష్టం చేశారు.
చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత పార్టీ నేతలు
టీడీపీ తరపున లోక్ సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వారిలో రామ్మోహన్ నాయుడు లోక్ సభాపక్ష నేతగా ఎంపికయ్యారు , గల్లా జయదేవ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. దీంతో విప్ పదవి తీసుకోవడానికి కేశినేని నాని మినహా లోక్ సభలో టీడీపీకి మరో నాయకుడు లేడు. ఇలాంటి సమయంలో మరో నేతకు విప్ పదవి ఇవ్వాలని కేశినేని నాని వ్యాఖ్యానించడం పార్టీపై ఆయనకున్న అసంతృప్తికి అద్దంపడుతోంది. ఒకవేళ పదవి వద్దని భావిస్తే అది చంద్రబాబుతో చర్చిస్తే సరిపోయేది. కానీ నానీ దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి తన అసహనాన్ని, పార్టీ పట్ల తన అసంతృప్తిని బయటపెట్టారు. ఏదిఏమైనా సొంత పార్టీ నేతలే చంద్రబాబుకు ప్రస్తుతం చుక్కలు చూపించే పనిలో పడ్డట్టు తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.