ఎంపీ మోపిదేవి చీరాల పర్యటనలో ఉద్రిక్తత, వాడరేవులో ఎస్సై కారు ధ్వంసం , ఆమంచి వర్గీయుడిపై దాడి
చీరాల వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్య కార్మికుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈరోజు మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ చీరాలలో ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కఠారి వారి పాలెం, వాడరేవు మత్స్యకారులను పరామర్శించారు. ఎంపీ పర్యటన కూడా ఉద్రిక్తతల మధ్య కొనసాగింది . ఇరు గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. తమపై దాడికి పాల్పడిన కఠారి వారి పాలెం మత్స్య కారులను శిక్షించాలని వాడరేవు మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు .
సముద్ర తీర ప్రాంతాల్లో ఫైటింగ్ .. చీరాలలో టెన్షన్ .. మత్స్యకారుల మధ్య ఘర్షణకు కారణం ఇదే !!
Recommended Video
వాడరేవు, కఠారి వారి పాలెం క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ
ఇక ఈ రోజు వాడరేవు, కఠారి వారి పాలెం క్షతగాత్రులను మోపిదేవి వెంకటరమణతో పాటుగా ఎమ్మెల్యే కరణం బలరాం , కరణం వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తదితరులు పరామర్శించారు. ఒకపక్కన వాడరేవు , కఠారి వారి పాలెం మత్స్యకారుల మధ్య నెలకొన్న ఘర్షణ ఇంకా ఆందోళనకరంగానే ఉంది. వాడరేవులో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ రెండు గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు సైతం మత్స్యకారుల నుండి ప్రతిఘటన ఎదురవుతోంది.
ఈపురుపాలెం ఎస్సై సుధాకర్ కారుపై రాళ్లతో దాడి చేసిన వాడరేవు మత్స్యకారులు
ఈపురుపాలెం ఎస్సై సుధాకర్ కారుపై రాళ్లతో మత్స్యకారులు దాడికి పాల్పడ్డారు .ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు మత్స్యకారులను పరామర్శించిన మోపిదేవి వెంకటరమణ ముందే ఆ మంత్రికి వ్యతిరేకంగా ఆమంచి డౌన్ డౌన్.. ఆమంచి గో బ్యాక్ అంటూ వాడరేవు మత్స్యకారులు నినాదాలు చేశారు . ఐకాన్ ఆసుపత్రి వద్ద మోపిదేవి బాధితుల పరామర్శ సమయంలోనూ ఓ మహిళ మోపిదేవి వెంకటరమణ ముందే ఆమంచిని నిలదీసింది.
ప్రసాద్ నగర్ వద్ద ఆమంచి వర్గీయునిపై కరణం వర్గీయులు దాడి
చీరాల లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆమంచి, కరణం వర్గీయులను ఆస్పత్రిలోకి అనుమతించలేదు. ఇదిలా ఉంటే ప్రసాద్ నగర్ వద్ద ఆమంచి వర్గీయునిపై కరణం వర్గీయులు దాడి చేశారు . ఈ దాడిలో ఆమంచి అనుచరుడికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మొత్తానికి చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ వర్సెస్ కరణం బలరాం వివాదం పెద్దఎత్తున కొనసాగుతున్నట్లుగా అర్థమవుతుంది. వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్యకారుల ఘర్షణకు కూడా ఓ రకంగా ప్రజాప్రతినిధులే కారణమన్న భావన స్థానికంగా వ్యక్తమవుతోంది.
మత్స్య కారుల ఘర్షణకు ప్రజాప్రతినిధుల తీరే కారణం
గత కొంత కాలంగా వాడరేవు ,కఠారి పాలెం మత్స్య కారుల మధ్య పోరు నడుస్తున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు అన్న వాదన వినిపిస్తుంది. దాని పర్యవసానమే తాజా పరిణామాలు అని స్థానికులు చెప్తున్నారు. . చేపల వేటకు ఉపయోగించే వల విషయంలోనే వాడరేవు , కఠారి వారి పాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది.వాడరేవు మత్స్యకారులు బల్లవల ఉపయోగిస్తుండగా కఠారి పాలెం జాలర్లు ఐలవల వాడాలని, బల్లవల కారణంగా చేపలతోపాటు గుడ్లు కూడా బయటకొచ్చి మత్స్యసంపద నశించిపోతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అధికార యంత్రాంగం , ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగినా చల్లారని ఉద్రిక్తత
కఠారి వారి పాలెం మత్స్యకారులు చెప్పింది వాడరేవు మత్స్యకారులు వినకుండా అలాగే చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. వీరి సమస్యను పరిష్కరించటంలో అధికార యంత్రాంగం సైతం ఫెయిల్ అయ్యింది. ఫలితంగా మత్స్యకారులు కర్రలకు పని చెప్పి విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. ఫలితంగా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు . ఈ సమస్యను పరిష్కరించటానికి అటు అధికార యంత్రాంగం , ఇటు ప్రజా ప్రతినిధులు ప్రయత్నం మొదలుపెట్టినా ఉద్రిక్తత చల్లారటం లేదు .