ఖబడ్దార్ కొడాలి నానీ: రాబోయే రోజుల్లో జరిగేదదే.. ఎంపీ రఘురామ వార్నింగ్
ఏపీ మంత్రి కొడాలి నానీకి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరో తన అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. విగ్రహాలు విరిగిపోతే ఏంటని మంత్రి కొడాలి నాని హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. నేడు ఢిల్లీలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణంరాజు హిందువుల మనోభావాలను మంత్రి కొడాలి నాని గాయ పరుస్తున్నారు అని ఫైర్ అయ్యారు.
నానీ తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుంది
తగలబెట్టింది అంతర్వేది రథాన్ని కాదని , భక్తుల మనో రథాలను అని , విరగ్గొట్టింది విగ్రహాలను కాదని, భక్తుల మనోభావాలను అని రఘురామ ఫైర్ అయ్యారు. మతోన్మాదంతో చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుందంటూ పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, దేవాలయాలపై దాడుల వల్ల, విగ్రహాలను ధ్వంసం చేయడం వల్ల హిందువులకు నష్టం జరుగుతోందని, వారి మనసులు గాయపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేపదే ఈ తరహా వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవటం మంచిది కాదని హితవు పలికారు.
రాబోయే రోజుల్లో చెయ్యి విడగొడితే చెయ్యి, కాలు విరిగితే కాలు విరగ్గొడతారు
కొడాలి నానికి, ఆయన వెనుక వున్న అదృశ్య శక్తికి తన హెచ్చరిక అంటూ మాట్లాడిన రఘురామకృష్ణంరాజు రాబోయే రోజుల్లో చెయ్యి విడగొడితే చెయ్యి, కాలు విరిగితే కాలు విరగ్గొడతారు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పార్లమెంట్లో మాట్లాడుతుంటే కావాలనే అల్లరి చేయించారు అంటూ మండిపడ్డారు. దేవాలయాలపై దాడులు జరిగితే ఎవరికి నష్టం అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించడం హేయమైన చర్య అన్నారు.
మీకువిగ్రహాలు రాళ్ళలా కనిపించొచ్చు కానీ మాకు దేవుళ్ళు
ఎన్నికల్లో గెలవాలంటే హిందువుల ఓటు బ్యాంకు కావాలి, కానీ హిందువుల మనోభావాల పట్ల గౌరవం లేదంటూ మండిపడ్డారు. హిందువుల మనోభావాలను గౌరవించకున్నా పర్వాలేదు కానీ, అవమానించకండి అంటూ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నేతలకు, మంత్రులకు హితవు పలికారు. వైసీపీ మంత్రి కొడాలి నానికి విగ్రహాలు రాళ్ళలా కనిపించొచ్చు, కానీ విగ్రహాలు మా దృష్టిలో దేవుడు అంటూ రఘురామ పేర్కొన్నారు. పోయింది వెండినే కదా అని చెప్పొచ్చు, కానీ పోయింది అమ్మవారి వెండి అని రఘురామ వ్యాఖ్యానించారు.
కొడాలి నానీ వెనుక అదృశ్య శక్తి... వార్నింగ్ ఇచ్చిన రఘురామ
దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లు, దేవుడి సొమ్ము కొట్టేసిన వాళ్ళు బాగుపడినట్లు చరిత్రలో లేదంటూ వ్యాఖ్యానించిన రఘురామ కొడాలి నానికి, నాని వెనుక వున్న అదృశ్య శక్తికి హిందూమతం జోలికి రావద్దు అంటూ హెచ్చరించారు. ఇప్పటికే కొడాలి నానీ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు , బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. ఈ సమయంలో రఘురామ కూడా తీవ్ర స్థాయిలో కొడాలి నానీపై ధ్వజమెత్తారు .