కుల జులుం... అన్నింట్లోనూ రెడ్లే... ప్రజలు చూస్తూ ఊరుకోరు... జగన్కు రఘురామ హెచ్చరిక...
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఎక్కడ ఏ పోస్టు ఖాళీగా ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారితోనే భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. పొద్దున లేచి పేపర్ చూస్తే రెడ్డి పోస్టింగులకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయని అన్నారు. క్రిస్టియన్ అయిన జగన్ అన్ని కులాలను సమానంగా చూస్తాడని భావించి ప్రజలు ఓట్లు వేశారని... ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలంటే అందరికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం జీతంతో పార్టీకి పని చేయించుకుంటారా...?
ప్రభుత్వ ఉద్యోగి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై రఘురామకృష్ణం రాజు తీవ్ర విమర్శలు చేశారు. 'నేనిప్పుడు కులం అధికార జులుం గురించి మాట్లాడుతున్నాను. అతనో ప్రభుత్వ ఉద్యోగి. గతంలో యువజన శ్రామిక రైతు పార్టీలో పనిచేసేవాడు. అప్పుడు జీతమిచ్చేవారో లేదో నాకు తెలియదు. కులాభిమానంతో పనిచేసి ఉండవచ్చు. ఆ రుణం తీర్చుకోవడానికి డిజిటల్ మీడియా డైరెక్టర్ అని ప్రభుత్వం ఇప్పుడో పదవి ఇచ్చి ఉండవచ్చు. సోషల్ మీడియా వైఎస్సార్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న అతనికి నెలకు రూ.2లక్షలు జీతం,కారు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే వ్యక్తితో పార్టీకి పనిచేయించుకోవడమేంటి...' అని రఘురామ ప్రశ్నించారు.
నా బొచ్చు సంగతి నీకెందుకు....
గతంలో సోషల్ మీడియాలో తనపై గుర్రంపాటి చేసిన విమర్శలను రఘురామకృష్ణం రాజు గుర్తుచేశారు. ‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు స్వపక్షంలో విపక్షమంటూ కొత్త పత్యానికి పరుగులు పెట్టి మాటతో సరిపెట్టుకునేదానికి వేటుదాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్లేనా? విగ్గు ఊడిపోతే రేపటినుంచి ఎలా తిరుగుతారో?' అంటూ తనపై విమర్శలు చేశారని అన్నారు. అయితే తన బొచ్చు గురించి దేవెందర్ రెడ్డికి ఏం అవసరమని ప్రశ్నించారు. 'పిచ్చివాడా... నువ్వు సరిగా నిలుచుంటే నా బొడ్డు దాకా కూడా రావు అని ఎవరో చెప్పారు. అందరూ మీకు లాగా పొట్టిగా,వికారంగా,నల్లగా ఉండాలని కోరుకోవడం మీ సంస్కారమైతే నేనేమీ చేయలేను. అదృష్టవశాత్తు దేవుడు నన్ను మీకంటే అందంగా పుట్టించాడు. దురదృష్టవశాత్తు బొచ్చు ఊడితే కవర్ చేసుకుంటున్నాను. నా బొచ్చుతో నీకు ఇబ్బందేంటి. నువ్వు ప్రేమించేవాడి కన్నా నేను పొడుగ్గా,అందంగా,తెల్లగా ఉంటే తట్టుకోలేకపోతున్నావా..' అని రఘురామకృష్ణం రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అన్నింట్లోనూ రెడ్లనే నియమించుకుంటూ పోతే...
ఒక చిరుద్యోగి అయిన దేవెందర్ రెడ్డి రెడ్డి ఫీలింగ్తో ఇలా తనపై విమర్శలు చేసి ఉండవచ్చునని అన్నారు. పార్టీ వేరు,ప్రభుత్వం వేరు అని... ప్రభుత్వం జీతం తీసుకుంటూ పార్టీకి పనిచేయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఎంతమందితో పనిచేయించుకుంటున్నారని నిలదీశారు. ఎక్కడో ఉన్నవాళ్లను తీసుకొచ్చి పోస్టింగులు ఇవ్వడం,ఇలా అన్నింట్లోనూ రెడ్లను నియమించుకుంటూ పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఏ క్వాలిఫికేషన్ లేని ప్రతీ రెడ్డికి ఉద్యోగం ఇచ్చి ఇలా ఎంపీలపై అవాకులు చవాకులు పేలమంటారా అని ప్రశ్నించారు. మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనుకునే వ్యక్తి అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
కడుపుమండి ప్రశ్నిస్తున్నానని...
అసెంబ్లీలో చీఫ్ విప్స్ అంతా రెడ్డి సామాజిక వర్గం వారేనని,తిరుపతి ట్రస్టు బోర్డులో,పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కమిటీలో,వైస్ ఛాన్సలర్లుగా... ఇలా అంతా వాళ్లనే నియమిస్తున్నారని రఘురామకృష్టం ర ాజు ఆరోపించారు. ఎక్కడైనా రెండు పోస్టులు ఉంటే పెద్ద పోస్టు రెడ్డి సామాజిక వర్గానికి,చిన్న స్థాయి పోస్టు బీసీ,ఎస్సీలకు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని,ప్రజల మనసు తెలుసుకుని మెలగాలని సూచించారు. తనకు కడుపు మండి ఇవన్నీ ప్రశ్నిస్తున్నానన్నారు.