ముఖ్యమంత్రి గారూ.. మీ పక్కనున్న కట్టప్పలను గుర్తించండి : ఎంపీ రఘురామ టార్గెట్ వారేనా!!
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపైన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు .రాజమండ్రిలో ఆవ భూముల కొనుగోలులో ప్రభుత్వ పెద్దలు చేతివాటం చూపించారని,వరద గోదారి ఘోష ఏ విధంగా ఉందో, రాజమండ్రి ప్రజలు కూడా అదేవిధంగా ఘోషిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ అవినీతికి పాల్పడుతున్న కట్టప్ప ను పట్టుకుని తీరాలి అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అవినీతి ఎలా జరుగుతుందో చెప్పిన ఎంపీ రఘురామ
ఒకపక్క అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే మరోపక్క ప్రతీ విషయంలోనూ అవినీతి అక్రమాలు కామన్ గా మారాయని ఆయన పేర్కొన్నారు . ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం కోసం జిపిఆర్ఎస్ విధానాన్ని తీసుకు రావడం మంచిది అని , అయితే జిపిఆర్ఎస్ పరికరాన్ని లారీలకు కాకుండా టూవీలర్ లకు పెట్టుకొని గమ్యస్థానానికి వెళుతున్నారని, లారీలలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీని వెనుక కూడా ముఖ్యమైన వాళ్ళే ఉన్నారని అన్నారు.
మీ పక్కనే ఉంటూ అవినీతికి పాల్పడే కట్టప్పలను పట్టుకుతీరాలి : జగన్ కు సూచన
అవినీతిని ఏమాత్రం ప్రోత్సహించని ముఖ్యమంత్రిగా మీకు పేరుందని, కానీ మీ పక్కనే ఉంటూ అవినీతికి పాల్పడుతున్న కట్టప్పలను మీరు పట్టుకుని తీరాలి అంటూ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ కు సూచించారు. సీఎం గారు మీ చుట్టూ ఉండే కట్టప్ప లను మీరే గుర్తించకుంటే ప్రమాదమని హెచ్చరించారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. సినిమా కాబట్టి బాహుబలిని కట్టప్ప పొడిచాడు. కానీ మీ పక్కనే ఉన్న కట్టప్పను మీరు పట్టుకుని తీరాలి. రాష్ట్ర ప్రజలు మీపై నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఆ విశ్వసనీయతను మీరు కాపాడుకోవాలని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
ఇళ్ళ స్థలాల కోసం కొన్న భూముల్లో చేతివాటంపై ఆగ్రహం
మీ చుట్టూ పనికిరాని మాటలు చెప్తూ, వీరిపై వారిపై చాడీలు చెబుతూ, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్న, ప్రజలను నిలువెత్తు దోపిడీ చేస్తున్న కట్టప్పలు చాలా మంది ఉన్నారని వారిని మీరు పట్టుకోవాలని, శిక్షించాలని రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏమాత్రం గృహ అవసరాలకు పనికిరానటువంటి స్థలాన్ని ,10 లక్షల రూపాయలకే కొనుగోలు చేయగలిగిన స్థలాన్ని ప్రభుత్వ పెద్దలు 20 లక్షలు చెల్లించి,25 లక్షలు చేతివాటం చూపి కొనుగోలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఆ కట్టప్ప వల్లే దోపిడీ .. విజయసాయిపై పరోక్ష వ్యాఖ్యలు
ఈ రకంగా విశృంఖల దోపిడీకి పాల్పడుతున్న వారు సిఎం తన బంధువులుగా భావిస్తే చర్యలు తీసుకోకపోతే ప్రధాని మోడీ కి ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల వెనుక ఉన్నది తనను ఇబ్బంది పెడుతున్న కట్టప్పనేనని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఏ విషయాలు తీసుకుపోనీయకుండా అడుగడుగునా అడ్డు పడుతున్నారని, ముఖ్యంగా తమ జిల్లాకు చెందిన వ్యవహారాలు చూసే కట్టప్పనే దీనికంతటికీ కారణం అని రఘురామకృష్ణంరాజు పరోక్షంగా విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేశారు.
సీఎం జగన్ లక్ష్యం గొప్పది .. కట్టప్పల వల్లే నష్టం జరుగుతుంది : రఘురామ
తనకు ఎమ్మెల్యేలతో విభేదాలు రావడానికి, ఎమ్మెల్యేలు తన దిష్టిబొమ్మలు దహనం చేయడానికి అన్నిటికీ ఆ కట్టప్పనే కారణమని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ప్రజలకు ఎంతో చేయాలని, పారదర్శక పాలన అందించారని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కట్టప్పలను గుర్తించాలని పదే పదే పేర్కొన్నారు. వారి వల్లే రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయని బల్లగుద్ది మరీ చెప్పారు. కట్టప్పల వల్ల సీఎం జగన్ లక్ష్యం నీరుగారిపోతుందని పేర్కొన్నారు .