రఘురామ తన మనవడికి వైఎస్ఆర్ పేరు పెట్టారట .. ఆసక్తికర విషయాలు చెప్పిన ఎంపీ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఆయన తన మనవడికి రాజశేఖర్ అని పేరు పెట్టుకున్నా అని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రామకృష్ణంరాజు ఢిల్లీలోని ఆయన నివాసంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు.
తన మనవడికి రాజశేఖర్ అని పేరు పెట్టానన్న రఘురామ
వైయస్ రాజశేఖర్ రెడ్డి తో తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉందని అన్నారు. తన పంచె కట్టు వైయస్ రాజశేఖర్ రెడ్డిని చూసి అలవర్చుకున్నదేనని, ఆయనను కాపీ కొట్టిందే అని గర్వంగా చెప్పారు.తన మనవడికి రాజశేఖర్ అని పేరు పెట్టుకోవడమే కాకుండా తన ఇంట్లో వైఎస్ నిలువెత్తు చిత్రపటాన్ని పెట్టుకున్నానని రఘురామ చెప్పుకొచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడని, ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా గౌరవించే స్వభావం ఉన్న వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు.
మరణానంతరం చిరస్థాయిగా నిలిచినవారిలో ఒకరు వైఎస్ఆర్
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ పథకాన్ని ప్రారంభించినా తన పేరు పెట్టుకోలేదని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆయనెప్పుడూ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టే వారిని ,అలా పక్క వారిని గౌరవించడం ద్వారా ఆయన తన వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా పెంచుకున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. మరణానంతరం కూడా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన వ్యక్తుల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో ఎంజీఆర్ కు కూడా అంతే స్థాయిలో గుర్తింపు ఉందని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
రచ్చబండ రద్దు చేసుకుని వైఎస్ కు నివాళులు
ఎంతో మందికి అడగకుండానే సహాయం చేసిన గొప్ప వ్యక్తిత్వం వైయస్సార్ ది అని కొనియాడారు. బోయవాడు వాల్మీకి గా మారినట్టు, వైయస్సార్ సీఎం అయిన తర్వాత చాలా మారిపోయారని పేర్కొన్నారు. తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన పుట్టినరోజని గుర్తు చేసుకున్న రఘురామ వైయస్ గొప్ప వ్యక్తిత్వానికి కితాబిచ్చారు. ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై, ప్రభుత్వ నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు వైయస్ వర్ధంతి సందర్భంగా రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
జగన్ నిర్ణయాలతో విభేదిస్తూనే ఆయన తండ్రి వైఎస్ కు కితాబు
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించి ఆయనతో ఉన్న తన అనుబంధాన్ని పంచుకున్నారు. వైయస్ రాగద్వేషాలను దగ్గరనుంచి గమనించానని ప్రాక్టికల్ గా చూశానని ఆయన గొప్పతనాన్ని స్మరించుకున్నారు. ఒకపక్క ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను , వైఎస్ తనయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలని విభేదిస్తూనే రఘురామ కృష్ణం రాజు, జగన్ తండ్రి , దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చాలా గొప్పవారంటూ కితాబిస్తున్నారు.