జగన్కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్లో ట్విస్ట్
తనకు జారీ అయిన షోకాజ్ నోటీసులకు చట్టబద్ధత లేదంటూ సొంత పార్టీపైనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. పార్టీ పేరు, దాన్ని పిలిచే తీరు, క్రమశిక్షణా కమిటీ చట్టబద్ధత తదితర అంశాలపై రఘురామ లేవనెత్తిన అభ్యంతరాలు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. సీఎం జగన్ కు షాకిచ్చేలా ఆయన పార్టీ పేరును పోలిన అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది. వైసీపీ గుర్తింపు రద్దయ్యేలా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని ప్రకటించింది.
జగన్ వల్ల దేశానికి చెడ్డపేరు రావొద్దు.. నిర్మలా సీతారామన్ షాకింగ్ కామెంట్స్.. ఏపీకి భారీగా నిధులు..
ఆ పేరు మాకే సొంతం..
షోకాజ్ నోటీసులకు సమాధానంగా రఘురామ లేవనెత్తిన అభ్యంతరాల్లో ప్రధానమైనది పార్టీ పేరన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నడిచేది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకాగా.. దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ గా పేర్కొంటూ, జాతీయ కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి పేరిట నోటీసులు పంపడాన్ని నర్సాపురం ఎంపీ తప్పుపట్టారు. కాగా, ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ‘‘ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ''గా వ్యవహరించే హక్కు తమకే ఉందని అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంది.
వైసీపీపై ఈసీకి ఫిర్యాదు..
జగన్ నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీయపురెడ్డి రాజారామిరెడ్డి మీడియాకు తెలిపారు. ‘‘జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన మా పార్టీ పేరును ఉపయోగించుకుని వాళ్లు(వైసీపీ) ఎన్నికల్లో గెలిచారు. ఈసీలో నమోదైన పేరును కాదని, మా పార్టీ పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ గా పిలిపించుకునే అర్గత మాకు తప్ప జగన్ పార్టీకి లేదు. మా పార్టీ పేరు మీదనే గత ఎన్నికల్లో మైదుకూరు(కడప జిల్లా) నుంచి అసెంబ్లీకి పోటీ చేశాను''అని శ్రీయపురెడ్డి తెలిపారు.
అసలెక్కడిదీ పార్టీ?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా వ్యవహరించే అధికారం మనకు లేదంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖలో పేర్కొనడంతో చాలా కాలం తర్వాత ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' ప్రస్తావన తెరపైకొచ్చింది. జగన్ పార్టీ ఏర్పాటు, వైఎస్ పేరుతో ఏర్పాటైన పార్టీలు, ఈసీకి సంబంధించిన టెక్నికల్ అంశాలపై కొద్ది గంటలుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో పదుల కొద్దీ పార్టీలు ఏర్పాటుకాగా, వాటిలో కొన్నింటికే ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. వాటిలో ‘‘అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ'' ఒక్కటే వైఎస్సార్ కాంగ్రెస్ గా వ్యవహరించొచ్చని రఘురామ పేర్కొన్నారు. ఇంతకీ ఆ పార్టీ ఎవరిదంటే..
మూడు నెలల ముందే కర్చీఫ్..
2011 మార్చి 12న వైఎస్ జగన్.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) నెలకొల్పడానికి మూడు నెలల ముందే ‘‘అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ'' పేరుతో ఇంకో పార్టీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకుంది. కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా దీని వ్యవస్థాపకుడు. తమకు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలవడానికి అనుమతి ఉందని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా వ్యవహరించే హక్కు లేదని ఆ పార్టీ రైతు విభాగం చీఫ్ శ్రీయపురెడ్డి రాజారామిరెడ్డి తెలిపారు.
ముహుర్తం దగ్గరపడుతోంది..
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ''గా వ్యవహరించే హక్కు లేదంటూ ఎంపీ రఘురామ, అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ప్రకటనలపై జగన్ పార్టీ నేతలందరూ ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రఘురామ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి స్పందించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈసీ ఫిర్యాదుతో సంబంధం లేకుండా పార్టీ షోకాజ్ నోటీసులకు సమాధానం చెబుతానని నర్సాపురం ఎంపీ తెలిపారు. సోమవారం(29న) మధ్యాహ్నం 12 గంటలకు షోకాజ్ నోటీసులు సమాధానమిస్తానని రఘురామ వెల్లడించారు. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన రఘురామ ఎపిసోడ్ లో ఇంకెన్ని ట్విస్టులు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి..