వేధింపుల కేసులో రాజయ్యకు బెయిల్: ఉత్తమ్కు ఊరట
హైదరాబాద్: భర్త, అత్తమామలు వేధింపులకు పాల్పడుతున్నారని వరంగల్ ఎంపి రాజయ్య కోడలు పెట్టిన కేసులో రాజయ్య, ఆయన భార్యకు ఊరట లభించింది. రాజయ్య కుమారుడు అనిల్ కుమార్ భార్య సారిక తనను తన భర్త, అత్తామామలు వేధింపులకు గురి చేస్తున్నారని హైదరాబాద్లోని బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఎంపి రాజయ్య దంపతులు ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. రాజయ్య దంపతులకు బెయిల్ మంజూరైంది. కాగా, రాజయ్య కుమారుడు అనిల్ కుమార్కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
ఉత్తమ్ కుమార్కు ఊరట
మాజీ మంత్రి, హుజుర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు గౌతం కుమార్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఏప్రిల్ 30న జరిగిన ఎణ్నికల్లో డబ్బులు పంపిణీ చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెందిన కారులో నగదు తరలిస్తున్నారన్న కారణంగా ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నల్గొండ జిల్లా సూర్యపేట పోలీసులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌతంకుమార్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.
పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని ఉత్తమ్, గౌతంలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా కారులో తరలిస్తున్న నగదు పాక్షికంగా దగ్ధమైన ఘటన సూర్యపేటలో ఏప్రిల్ 30న చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
కారు పిటిషనర్ల కంపెనీకి చెందినదని, దాని ముందుభాగం ప్రమాదానికి గురికావడంతో డ్రైవర్ ఓ దాబా వద్ద కారును నిలపి, మెకానిక్ కోసం ఎదురుచూస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాలిపోయిన డబ్బు కంపెనీకి చెందినదని, ఆ నగదు ఓ వ్యక్తి నుంచి తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఆ డబ్బు ఉపయోగించడానికనే ప్రాథమిక ఆధారాలేవి లేవని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ల వాదనను ఏకీభవించిన జడ్జి.. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపేయాల్సింది ఉత్తర్వులు జారీ చేశారు.