మా బాధ వినకుండా కాంగ్రెస్ విభజించింది, ఇప్పుడు భేష్: రామ్మోహన్, మోడీ ఆసక్తిగా..
ఢిల్లీ: పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం అందర్నీ అలరించింది. రాజ్యాంగం ఆమోద దినం సందర్భంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.
గతంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి, రాజ్యాంగాన్ని అవమానించిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రయానికి సంబంధం లేకుండా విభజన చేశారన్నారు. కేంద్రం పెద్దన పాత్ర పోషించలేదన్నారు.
నియంత పాత్ర పోషించిందని దుయ్యబట్టారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడానికి కారణం పార్లమెంటులో న్యాయం జరగాలని భావించారన్నారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలకు విలువ నివ్వలేదన్నారు. చేయని తప్పుకు ఆంధ్రప్రదేశ్కు శిక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంటు పని చేయాల్సిన పద్దతి అది కాదన్నారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగం అమలు కావాలన్నారు. పార్లమెంటు ముందుకు ప్రజలకు ఉపయోగపడే అంశాలు మాత్రమే బిల్లు రూపంలో రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, రాష్ట్రాల సమస్యలను సామరస్య ధోరణితో పరిష్కరించారన్నారు.
తాను రెండుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చానని, రాష్ట్ర విభజన వల్ల మేం సమస్యలు ఎదుర్కొంటున్నామని రామ్మోహన్ అన్నారు. ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఆయన గురువారం లోకసభలో మాట్లాడారు.
ఏపీని విభజించేటప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వం (యూపీఏ) తమ అభిప్రాయాన్ని వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వం ఉమ్మడి ఏపీని ఏపీ, తెలంగాణలుగా విడగొట్టినప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసిందని అభిప్రాయపడ్డారు.
మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. సమాఖ్య వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం (ఎన్డీయే) సమర్థవంతంగా నడిపిస్తోందన్నారు. అందుకు అభినందనలు అన్నారు. రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చినప్పుడు కేంద్రం పెద్దన్నయ్యలా చూసుకోవాల్సి ఉంటుందన్నారు.
మేం రాష్ట్ర విభజన వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రజలను మించిన న్యాయ నిర్ణేతలు లేరన్నారు. వారే అంతిమ నిర్ణేతలు అన్నారు. మహిళా సాధికారత కీలక అంశమని చెప్పారు. రాజ్యాంగపరంగా మహిళలకు సాధికారత కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేసేలా రాజ్యాంగ సవరణ తేవాలన్నారు.
రామ్మోహన్ నాయుడు చేసిన ప్రసంగం ప్రధాని మోడీ సభలో అందరూ సావధానంగా విన్నారు. ప్రసంగం ఇంగ్లీషులో ధాటిగా సాగుతుండగా ఓ ఎంపీ హిందీలో మాట్లాడాలని కోరడంతో ఆయన హిందీలోనూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.