బాబు నాకు ఎలా అంటే, ఆ రోజు అందుకే విమర్శించా, ఫోన్ చేశానని తెలిస్తే చాలు: శివప్రసాద్
అమరావతి: ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనకు అన్నలాంటి వాడని, తాను పార్టీ మారడం లేదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చెప్పారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి గ్యాప్ రాదని చెప్పారు. తామిద్దరం 6 నుంచి 11 వరకు కలిసి చదువుకున్నామన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జగన్కు గట్టి షాక్: వైసీపీ షరతులు, చంద్రబాబుపై పోటీ చేసిన నేత రాజీనామా, కంటతడి
చంద్రబాబు తనకు మంచి స్నేహితుడు అని చెప్పారు. తమ మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం అవాస్తవం అన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టడంపై శివప్రసాద్ స్పందించారు. ఆ రోజు కులం కోసం ఏం చేశారని ఎస్సీలంతా తనను నిలదీశారని, అలాంటప్పుడు అలా స్పందించాల్సి వచ్చిందన్నారు.
పార్టీ మారడం లేదు
పార్టీ మారుతున్నానని, టిడిపిలో సంతోషంగా లేనని వస్తున్న వార్తలు అన్నీ అబద్దమని శివప్రసాద్ చెప్పారు. తను అంటే ఇష్టపడని వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనకు వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేక కొందరు అలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. అంబేడ్కర్ జయంతి రోజు అధినేతను నిలదీయడంపై స్పందించారు.
చంద్రబాబు నిలదీతపై
తిరుపతిలో మెజారీటీ భూములు హథీరాంజీ మఠానికి చెందినవని శివప్రసాద్ చెప్పారు. ఆ భూములను పలువురు ఎస్సీలు, రైతులు కౌలుకి తీసుకున్నారన్నారు. ఆ భూముల విషయంలో తమను గతంలో పట్టించుకోలేదని, దీంతోనే తాను సీఎంను చూడమని మాట్లాడానని చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు? పీహెచ్డి చేస్తున్నవారికి స్కాలర్ షిప్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగానన్నారు.
అపాయింటుమెంట్ ఇస్తారు, నేను ఫోన్ చేశానని చెబితే
చంద్రబాబును తాను అపాయింటుమెంట్ అడిగితే ఇవ్వకపోవడం అన్నది జరగలేదని శివప్రసాద్ చెప్పారు. ఓసారి మాత్రం మూడు గంటలు ఆలస్యమైందని చెప్పారు. తాను ఫోన్ చేశానని చెబితే అటు నుంచి అరగంటలోపు ఫోన్ వస్తుందని చెప్పారు. అలాంటి సాన్నిహిత్యం తమ మధ్య ఉందన్నారు. తమ మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరిగిన తర్వాత మార్చి 1వ తేదీన ఆయనను కలిశానని చెప్పారు.
ఆ రోజు గంటన్నరకు పైగా మాట్లాడుకున్నాం
ఆ రోజు తామిద్దరం గంటన్నరకు పైగా పలు విషయాలు మాట్లాడుకున్నామని శివప్రసాద్ చెప్పారు. తనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదనే ఆలోచన ఉండేదన్నారు. పార్టీలో తనకు స్థానం కల్పించాక ఎస్సీల్లో తనకు మాత్రమే ఆయన ప్రతి ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తున్నారన్నారు.
పదేళ్ల తర్వాత అధికారం, సమీకరణాలు ఉంటాయి
పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చాక ఎన్నో సమీకరణాలు ఉంటాయని శివప్రసాద్ చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయన పని చేస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పార్టీలో పెద్దవారు అని, ఆయన మొదటి నుంచి చంద్రబాబు వెంటే ఉంటున్నారని చెప్పారు. కేంద్రం వద్దకు చంద్రబాబు చెప్పిన ఏ మాట వెళ్లాలన్నా అశోక్ గజపతిరాజు చేరవేస్తారన్నారు. తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది చంద్రబాబే అన్నారు.