దళితులకు అన్యాయం సరికాదు.. బాబుతో చర్చించడానికి సిద్దం: ఎంపీ శివప్రసాద్
క్రమశిక్షణకు మారు పేరు అని పదేపదే తమ పార్టీ గురించి వల్లె వేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఆమధ్య చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గట్టి ఝలకే ఇచ్చారు.
చిత్తూరు: క్రమశిక్షణకు మారు పేరు అని పదేపదే తమ పార్టీ గురించి వల్లె వేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఆమధ్య చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గట్టి ఝలకే ఇచ్చారు. అసలు టీడీపీ ప్రభుత్వం దళితుల కోసం ఏం చేసిందో చెప్పాలంటూ ఆయన ఆగ్రహించిన తీరు.. చంద్రబాబును ఉలిక్కిపడేలా చేసింది.
ఇంత మోసం చేస్తారా?: చంద్రబాబుపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిప్పులు
అంతేకాదు, దళితులను విస్మరిస్తే.. సహించేది లేదంటూ శివప్రసాద్ వ్యాఖ్యానించడం.. ఆయన రెబల్ గా మారుతున్నారన్న సంకేతాలు కూడా పంపించింది. ఆ తర్వాత శివప్రసాద్ను కట్టడి చేసేలా.. చంద్రబాబు క్లాస్ పీకడంతో అంతా సద్దుమణిగిందనే అనుకున్నారంతా. అయితే పార్టీనా? దళితులా? అన్న అంశం వచ్చినప్పుడు.. తన జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నట్లుగా శివప్రసాద్ వ్యవహరిస్తున్నారు. దీంతో సీఎం చంద్రబాబు శివప్రసాద్ వైఖరి పట్ల ఒకింత అసహనంతో ఉన్నారు.
దళితుల నిరసనకు ఎంపీ మద్దతు:
జిల్లాలోని నిండ్ర మండలం కొప్పెడు హరిజనవాడలో పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దళితులకు ఎంపీ శివప్రసాద్ తాజాగా మద్దతు పలికారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నవారికి శివప్రసాద్ మద్దతు తెలపడమేంటని సొంతగూటిలోనే ఆయన పట్ల భిన్నాభిప్రాయాలు విపిస్తున్నాయి. గత ఐదు రోజులుగా ప్లాంట్కు వ్యతిరేకంగా అక్కడ రిలే దీక్షలు జరుగుతున్నాయి.
అధికారులకు ఫిర్యాదు చేసేందుకు:
దళితుల నిరసనపై స్పందించిన ఎంపీ శివప్రసాద్.. ఒకచోట అనుమతి పొంది మరోచోట ప్లాంట్ నిర్మించడంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆందోళనకు చేస్తున్నవారికి మద్దతు పలికి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కొప్పెడలో దళితులు ఎదుర్కొంటున్న అన్యాయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
చంద్రబాబుతోనే చర్చిస్తానన్న ఎంపీ:
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా దళితులకు అన్యాయం చేసేలా వ్యవహరించడం సరికాదని ఎంపీ శివప్రసాద్ హెచ్చరించారు. దళితుల ఆందోళన వెనుక కారణాలు తెలుసుకుని వాటని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులు గనుక తగిన రీతిలో స్పందించపోతే చంద్రబాబుతోనే చర్చిస్తాననంటూ తేల్చేశారు.
తాగునీటి సమస్య పరిష్కారం:
గ్రామంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని రూపుమాపేలా యుద్దప్రాతిపదికన బోర్ వెల్ తవ్వించేందుకు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయిస్తానని ఎంపీ హామి ఇచ్చారు. మరోవైపు గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు పట్ల గ్రామస్తుల అభ్యంతరాలను స్థానిక ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు.
ప్లాంట్ వద్దంటున్న గ్రామస్తులు:
ఇప్పటికే గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉందని, దానిని ఆనుకునే ఇప్పుడు పవర్ ప్లాంట్ నిర్మించబోతున్నారని.. అలా చేస్తే గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుందని గ్రామస్తులు వివరించారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ ప్రస్తుతం పవర్ ప్లాంట్ అంశం కోర్టులో ఉందని, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన తీర్పు వస్తుందని తెలిపారు.