ఈడీ...తొందరపడింది:సుజనా చౌదరి;ఆయనపై దుష్ప్రచారం..న్యాయబద్దంగా ఎదుర్కొంటాం:సిఎం రమేష్
హైదరాబాద్:తాను డొల్ల కంపెనీల ద్వారా రూ.5700 కోట్ల మేరా మోసానికి పాల్పడినట్లు ఈడీ చేసిన ప్రకటనపై టిడిపి ఎంపి,మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్రంగా ప్రతిస్పందించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సరైన విచారణ జరపకుండానే తొందరపాటుతో ఆరోపణలు చేస్తోందని...ఈడీ అధికారులతో మాట్లాడితే అదే విషయాన్ని వారూ అంగీకరించారని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. మరోవైపు ఈడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరికి సిఎం రమేష్ మద్దతుగా నిలిచారు. సుజనాపై దుష్ప్రచారం చేస్తున్నారని...దీన్ని న్యాయబద్దంగా ఎదుర్కొంటామని అంటున్నారు.
సుజనా చౌదరి...ఏమన్నారంటే?...
సుజనా చౌదరి బ్యాంకులకు రూ.5700 కోట్ల రుణాన్ని ఎగవేస్తూ మోసానికి పాల్పడ్డారని ఈడీ లెక్కలు తేల్చి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ ఆరోపణలపై ఎంపి సుజనా చౌదరి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...‘‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సరైన విచారణ జరపకుండానే తొందరపాటుతో ఆరోపణలు చేస్తోంది...ఈ విషయమై ఇప్పటికే ఈడీ అధికారులతో మాట్లాడాను...వారు కూడా పొరపాటు జరిగిందని అంగీకరించారు...దీనిని చట్టపరంగా ఎదుర్కొంటాం''...అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చాకే...ఇలా
సుజనా చౌదరి ఇంకా ఏమన్నారంటే..."నేను 2009లో రాజకీయాల్లోకి వచ్చాను...2010లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయ్యాను...అలా అయిన వెంటనే 30 సంవత్సరాల క్రితం నేను స్థాపించిన కంపెనీలు అన్నింటిలో ప్రత్యక్ష డైరెక్టర్ పదవులు అన్నింటికీ రాజీనామా చేసేశాను. అంతేకాదు ఆ కంపెనీల నుంచి గత ఎనిమిదేళ్లలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కారణం నేను స్థాపించిన కంపెనీలు నన్ను మోసం చేయవన్న నమ్మకం''...అని చెప్పారు. తాను 2009లో రాజకీయాల్లోకి రాకముందు నుంచే వ్యాపార రంగంలో ఉన్నానని...అయినప్పటికీ ఎలాంటి ఆరోపణలు లేవన్నారు...రాజకీయాల్లో వచ్చాకనే ఇలాంటివి వస్తున్నాయని చెప్పుకొచ్చారు.
అది...నిజం కాదు
కేవలం రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నందుకే తనపై ఈడీని ప్రయోగించారని సుజనా చౌదరి తేల్చేశారు. అంతేకాదు తాను ఎటువంటి అక్రమాలు...అవినీతికి పాల్పడలేదని సుజనా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల గురించి వచ్చిన ఆరోపణలపై సుజనా చౌదరి వివరణ ఇస్తూ...బెస్ట్ అండ్ క్రామ్టన్ సంస్థ తనది కాదని...అది తన స్నేహితుడిదని...ఆ సంస్థ రుణం చెల్లించలేదంటూ తనకు నోటీసు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దేశం నలుమూలల నుంచి అనేక కంపెనీల ప్రతినిధులు సలహాల కోసం నా వద్దకు వస్తుంటారన్నారు. సుజనా చౌదరి నుంచి ఈ-మెయిల్ ద్వారా తమకు ఆదేశాలు వస్తాయని ఆ కంపెనీల సిబ్బంది చెప్పారన్న వార్తల్లో నిజంలేదన్నారు.
బ్యాంకులు ఉందే...అప్పులు ఇవ్వడానికి
నేను గత 27 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నా...ఈడీ జప్తు చేసిన ఆరు కార్లు మా అబ్బాయి, అమ్మాయి, మేనల్లుడి పేరున ఉన్నాయి...అందులో ఒకటి ఢిల్లీకి చెందిన పాత కారు. దాని విలువ రూ.3 లక్షలు కూడా ఉండదు'' అని సుజనా వివరించారు. అలాగే బ్యాంకుల ఫిర్యాదు మేరకే సోదాలు చేస్తున్నామని ఈడీ అధికారులు చెప్పారని...కానీ నిజానికి ఏ బ్యాంకూ తనపై ఫిర్యాదు చేయలేదని సుజనా చెప్పుకొచ్చారు. అంతేకాదు అసలు బ్యాంకులు ఉన్నవే అప్పులు ఇవ్వడానికని తేల్చేశారు. తమ కంపెనీల బకాయిలతో పోలిస్తే గత 30 సంవత్సరాల్లో తాము చెల్లించిన డబ్బు ఎంతో అధికమని...అప్పుల కంటే తమ ఆస్తుల విలువే ఎక్కువ ఉంటుందని సుజనా వెల్లడించారు.
నష్టాలు సహజం...అంతమాత్రాన
అంతేకాదు కంపెనీలు నష్టాల్లో నడవడం సాధారనమేనని...ఐఎల్ఎఫ్, సెయిల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటివి కూడా నష్టాల్లో నడుస్తున్నాయని...మరి వాటిని కూడా దివాలా తీశాయని ప్రకటిస్తారా అని సుజనా చౌదరి ఈడీని నిలదీశారు. ఇప్పటివరకూ సెబీతో సహా ఏ ఆడిట్ నివేదికలోనూ తమ కంపెనీల్లో అవకతవకలు జరిగినట్లు లేదని...ఈడీ తమపై చేసి ఆరోపణలకు చట్టపరంగా బదులిస్తానని సుజనా చౌదరి తెలిపారు. ఒకవేళ తన కంపెనీల్లో ఏవైనా అక్రమాలు జరిగివుంటే వాటిని చట్టపరంగా ఎదుర్కొంటానని ప్రకటించారు.
జగన్ విషయం వేరు...మాది వేరు
అయితే వైఎస్ జగన్పై ఈడీ విచారణను స్వాగతిస్తున్న మీరు...మరి మీ సంస్థల విషయానికి వచ్చేసరికి ఈడీని తప్పు పడుతున్నారని...ఇదెలా సమంజసమని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సుజనా చౌదరి బదులిస్తూ...జగన్ది అవినీతి కేసు అని...కానీ తనది అలాంటిది కాదన్నారు. అయితే తనను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చినందున...పార్లమెంటు సమావేశాల అనంతరం జనవరి 9న విచారణకు హాజరవుతానని సుజనా చౌదరి తెలిపారు.
న్యాయబద్దంగా...ఎదుర్కొంటామన్న సిఎం రమేష్
ఇదిలావుంటూ సుజనా చౌదరికి ఈడీ నోటీసులపై మరో టిడిపి ఎంపి సిఎం రమేష్ స్పందించారు. సోమవారం తిరుమలలో శ్రీవారి దర్శనాంతరం ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ...కేంద్రం సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకు వాడుకుంటోందని తేలిపోయిందన్నారు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి చెల్లుబాటు కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు దేశమంతా తిరుగుతూ అందరినీ ఏకం చేస్తుండటంతో వారికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. తాజాగా సుజనాచౌదరిపై దుష్ప్రచారం అందులో భాగమేనన్నారు. అయితే ఈ చర్యలన్నింటినీ న్యాయబద్దంగా ఎదుర్కొంటామని సీఎం రమేష్ వెల్లడించారు.