తరలింపు సులువు కాదు.. కేంద్రం ఊరుకోదు: సీఎం జగన్ ఒక రాయి వేశారు: ఎంపీ సుజనా..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు అంటూ..చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ సుజనా కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం అంత సులువు కాదని, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని స్పష్టంచేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని.. ఇదేమీ చిన్నపిల్లలాట కాదని సుజనా వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన జరిగన ఒక చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రస్తుతం ఊహాజనితంగా చెప్పారని, కానీ అధికారికంగా చేస్తే మాత్రం కేంద్రం తగినరీతిలో స్పందిస్తుందని చెప్పుకొచ్చారు. అమరావతి నుంచి గ్రోత్ ఇంజన్ను తరలించడం.. జగనే కాదు ఆయన తాతగారు వచ్చినా జరగదని తేల్చిచెప్పారు.
కేంద్ర చేస్తూ ఊరుకోదు..
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ఏం చెప్పారో తనకు అర్దం కాలేదని..మూడు రాజధానుల వ్యవమారం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అయిుదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నట్లుగా మూడేసి రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదన్నారు. ఇదేమీ చిన్నపిల్లలాట కాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో శాసనసభ మాత్రమే ఉంటే దాన్ని రాజధాని అనరని స్పష్టం చేశారు. అమరావతి ఇప్పటికే రాజధానిగా ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేసారు. సర్వే ఆఫ్ ఇండియా తన మ్యాప్లో రాజధానిగా గుర్తించిందని.. ఇప్పుడు చిన్నపిల్లలాటలాగా తరలిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని చెప్పుకొచ్చారు. ఈ గందరగోళానికి సంబంధించి తాను కేంద్రానికి సమాచారమిచ్చానని పేర్కొన్నారు. జగన్ ప్రస్తుతం ఊహాజనితంగా చెప్పారని, కానీ అధికారికంగా చేస్తే మాత్రం కేంద్రం తగిన రీతిలో స్పందిస్తుందని స్పష్టం చేసారు.
వికేంద్రీకరణకు ఇది పద్దతి కాదు..
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. కానీ ఇది పద్ధతి కాదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కేపిటల్ గెయిన్స్ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చిందని, వీటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. జగన్ తీరుతో రాష్ట్రం పదేళ్లు వెనక్కివెళ్లేలా ఉందని, ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని అర్థమవుతోందని చెప్పారు.
అధికారులు కూడా గందరగోళంలో పడ్డారని.. నిస్సహాయంగా ఉన్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు అనేక కష్టాలు పడి హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారని... ఇప్పుడు విశాఖకు వెళ్లాలంటే మరిన్ని కష్టాలు ఎదురవుతాయన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే అందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం ఒక సవాల్ అంటూ సుజనా వివరించారు.
రాజకీయ కోణంతో కాదు..
రాజధానిలో ప్రజా ప్రయోజనాల కోణం ఉండాలే కానీ, రాజకీయ కోణం ఉండకూడదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచించారు. రాజధాని విషయంలో ప్రాంతాల వారీగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. సీఎం జగన్ ప్రకటనతో రాజధానిపై కొంత స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలవారికి ఆశలు కలిగిస్తోందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు గతంలోనే బీజేపీ డిమాండ్ చేసిందని, ఇది అసాధ్యమేమీ కాదన్నారు. మూడు రాజధానులనేది కాస్త కొత్తగా ఉందన్నారు. శివరామకృష్ణ కమిటీ సిఫారసుల్లో కొన్నిటిని జగన్ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జీవీఎల్ అభిప్రాయ పడ్డారు.