ఏపీకి మూడు రాజధానులు అవసరం: ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్
రాజధాని అమరావతిపై నీలినీడలు కమ్ముకున్న నేపధ్యంలో రాజధాని డిమాండ్ విభిన్న ప్రాంతాల నుండి వినిపిస్తుంది. రాయలసీమలోని కర్నూల్ ని దేశానికి రెండవ రాజధాని చెయ్యాలని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ గతంలోనే డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని విషయంలో టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అవసరం అని ఆయన వ్యాఖ్యానించారు. రాయలసీమకు ఇప్పటికే పలుమార్లు అన్యాయం చేశారని , ఇప్పుడైనా రాయలసీమలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని ఆయన పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి గ్రేట్ రిలీఫ్: పోలవరం హైడల్ ప్రాజెక్టు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: నవయుగకు ఎదురుదెబ్బ
రాజధానిపై నిపుణుల కమిటీ .. బొత్సా వ్యాఖ్యల దుమారం .. బాబు ఫైర్
వైసీపీకి చెందిన మంత్రి బొత్సా రాజధాని విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిపుణుల కమిటీ పర్యటిస్తుందని, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందని , ఆ తర్వాతే రాజధానిపై స్పష్టత వస్తుందని చేసిన ప్రకటనతో మరోమారు రాజధాని అంశం వార్తల్లోకి వచ్చింది. వైసిపి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు . రాజధానిగా అమరావతి సరైనదని , నాడు అసెంబ్లీలో జగన్ సైతం రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని స్వాగతించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నాలుగేళ్ళకు రాజధానిపై నిపుణుల కమిటీ వేశామని చెప్పటం దారుణమని ఆయన పేర్కొన్నారు.
రాజధానిపై అనిశ్చితి .. మరోమారు టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు
ఇక మరోపక్క రాజధాని అంశంపై బీజేపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల కమిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుందని ఏపీ మంత్రులు చెప్తున్న నేపధ్యంలో రాయలసీమ నుండి ఎంపీ టీజీ వెంకటేష్ తమ వాణిని చాలా బలంగా వినిపిస్తున్నారు. ఇక తాజాగా నవ్యాంధ్రకు మూడు రాజధానులు అవసరం అంటూ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు . జమ్మూ కాశ్మీర్ కు మూడు రాజధానులు ఉంటె లేని ఇబ్బంది ఏపీలో మాత్రం ఉంటె తప్పేంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదన్న ఆయన ఒకవేళ అలా కొనసాగినా రాయలసీమ వాసులకు అన్యాయం జరిగినట్టే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీకి మూడు రాజధానులు అవసరం అన్న రాజ్య సభ సభ్యుడు టీజీ వెంకటేష్
రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ టిజి వెంకటేష్ జమ్మూ కాశ్మీర్లో మూడు రాజధానులు జమ్మూ , కాశ్మీర్ , లడక్ లు ఉన్నప్పుడు, ఏపీలో ఎందుకు ఉండకూడదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు .కర్నూలు జిల్లా కన్నా అతి చిన్న ప్రాంతం అయిన జమ్ముకాశ్మీర్ లో మూడు రాజధానులు ఉండగా ఏపీలో ఎందుకు వద్దని ఆయన ప్రశ్నించారు .రాయలసీమ ప్రాంతం వెనుకబడినందున రాయలసీమ ప్రాంతంలో రాజధాని మరియు హైకోర్టు ఏర్పాటు చెయ్యటం అవసరం అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి రాజధానిగా ఉన్నా నో ప్రాబ్లమ్.. రాయలసీమలోనూ రాజధాని కావాలన్న ఎంపీ
అమరావతిలో రాజధాని ఏర్పాటు వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కానీ రాయలసీమ కాదని, అక్కడ రాయలసీమ వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకవని ఎంపీ టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. నాడు నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి నాలుగు రాజధానులు ఏర్పాటు చెయ్యాలనే జగన్ మనసులోని మాట తాను చెప్పానన్న ఆయన ఇక అమరావతిలో రాజధాని ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కానీ రాయలసీమలో కర్నూలు కేంద్రంగా రాజధాని కావాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు టీజీ వెంకటేష్ .