మోడీ అంటే ఎంత భయం! ఢిల్లీ వెళ్లి చతికిలపడ్డారు: చంద్రబాబుపై వరప్రసాద్ సెటైర్లు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిన్న కులాలంటే చులకన భావమని, అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు మాత్రం చంద్రబాబుకు కావాలని అన్నారు.
బుధవారం ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ. ఏ ఒక్కరు దళితుడిగా పుట్టాలని కోరుకోరని గతంలో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారులను మీ అంతుచూస్తానని అన్న చంద్రబాబు.. తాజాగా కనీస వేతనాలివ్వలన్న నాయీ బ్రాహ్మణులపై ఆగ్రహంతో ఊగిపోయారని మండిపడ్డారు. అసలు చంద్రబాబులో మానవత్వం ఉందా? అని వరప్రసాద్ ప్రశ్నించారు.
బీజేపీపై యుద్ధం ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్లి చతికిల పడ్డారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి మోడీ అంటే బాబులో ఎంత భయం ఉందో అర్థమవుతుందని అన్నారు. 40ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తే అయితే చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవారని అన్నారు.
ప్రజాస్వామ్యం విలువ, ఓటు విలువ, దళితుల విలువ గురించి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో తెలుస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.