వైసీపీ ఎంపీలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఛైర్మన్ గా టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు!
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంట్ కు ప్రాతినిథ్యం వహిస్తోన్న నేతలకు కేంద్రం అత్యున్నత స్థానాల్లో నియమించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిల తరఫున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురికి స్థాయీ సంఘం చైర్మన్ పదవులు లభించాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి నియమితులయ్యారు. రవాణా, టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్థాయీ సంఘానికి టీజీ వెంకటేష్, జాతీయ పరిశ్రమల స్థాయీ సంఘానికి టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు ఛైర్మన్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో స్థాయీ సంఘంలో లోక్ సభ, రాజ్యసభల నుంచి ఎంపిక చేసిన 31 మందిని సభ్యులుగా నియమించారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులకు పెద్ద సంఖ్యలో సభ్యత్వ పదవులు లభించాయి.
వాణిజ్య శాఖ స్థాయీ సంఘం సభ్యులుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేశినేని నాని, కేవీపీ రామచంద్రరావు, తోట సీతారామలక్ష్మి నియమితులయ్యారు. హోం శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా వంగ గీతా, మానవ వనరుల అభివృద్ధి శాఖ స్థాయీ సంఘం సభ్యులుగా లావు శ్రీకృష్ణదేవ రాయలు, పరిశ్రమల శాఖ స్థాయీ సంఘం సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డిలను తీసుకున్నారు. రవాణా పర్యాటకం, సాంస్కృతిక స్థాయీ సంఘంలోకి గొడ్డేటి మాధవి, వ్యవసాయ స్థాయీ సంఘంలో పోచా బ్రహ్మానందరెడ్డి, ఐటి కమిటీలో ఎంవివి సత్యనారాయణ, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరిలను సభ్యులుగా నియమించారు. రక్షణ శాఖ కమిటీలో కోటగిరి శ్రీధర్, టి సుబ్బిరామిరెడ్డి, విదేశీ వ్యవహారాల కమిటీలోకి మార్గాని భరత్, గల్లా జయదేవ్, ఆర్థిక శాఖ స్థాయీ సంఘంలో వల్లభనేని బాలశౌరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు సభ్యులుగా నియమితులయ్యారు.
రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్. రెడ్డప్ప రెడ్డి, (వైసిపి), పట్టణాభివృద్ధి కమిటీలోకి సంజీవ్ కుమార్, గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా తలారి రంగయ్య, కింజరాపు రామ్మోహన్ నాయుడులను నియమించారు. బొగ్గు, ఉక్కు మంత్రిత్వశాఖ స్థాయీ సంఘంలోకి వెంకట సత్యవతి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాటు నిబంధనల కమిటీలోకి గల్లా జయదేవ్, వాణిజ్య, అంచనాల స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా కేశినేని నాని, అధికారిక భాషా స్థాయీ సంఘంలోకి రామ్మోహన్ నాయుడు, పెట్రోలియం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కనకమేడల రవీంద్రలను తీసుకున్నారు. ఈ లెక్కన చూస్తే.. దాదాపు అన్ని స్థాయీ సంఘాల్లోనూ ఏపీకి చెందిన ఎంపీలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.