ఊహించని ఘటన.. విజయసాయి రెడ్డి తీవ్ర అసహనం... లేని అధికారాన్ని ప్రదర్శించలేవని...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం(మార్చి 5) తలపెట్టిన బంద్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఊహించని పరిస్థితి ఎదురైంది. విశాఖపట్నంలో కార్మిక సంఘాల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా ఓ యువకుడి వ్యాఖ్యలకు నొచ్చుకున్నారు. అతని జబ్బపై ఒక చరుపు చరిచి తన ఉక్రోషాన్ని ప్రదర్శించారు. అంతేకాదు,నీకు లేని అధికారాన్ని నీవు ప్రదర్శించలేవు అంటూ అతన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చేతిలో మైకుతో విజయసాయి...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేతిలో మైకు పట్టుకుని అక్కడికి వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి నిరసనలో పాల్గొన్నవారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అలా ఓ యువకుడి వద్ద ఆగి అతని అభిప్రాయం చెప్పాలంటూ కోరారు. అతను పోస్కో కంపెనీతో ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో... అసలు పోస్కో కంపెనీతో ఎవరు ఒప్పందం చేసుకున్నారంటూ విజయసాయి ఆ యువకుడిని ఎదురు ప్రశ్నించారు. ఆ ఒప్పందం సీక్రెట్గా జరిగిందని.. ఎవరి హయాంలో జరిగినా ఇప్పుడున్నది వైసీపీ ప్రభుత్వమే కాబట్టి... దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత కూడా వైసీపీ పైనే ఉందని ఆ యువకుడు అభిప్రాయపడ్డాడు.
నీకు లేని అధికారాన్ని ప్రదర్శించలేవంటూ...
ఆ యువకుడి వ్యాఖ్యలపై అసహనం ప్రదర్శించిన విజయసాయి రెడ్డి.. అతని జబ్బపై ఒక చరుపు చరిచి అక్కడి నుంచి ముందుకు కదిలారు. అయినప్పటికీ ఆ యువకుడు మాట్లాడటం ఆపలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమే పోస్కో ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆ యువకుడి వ్యాఖ్యలకు విజయసాయిలో మరింత అసహనం పెరిగింది. దీంతో మళ్లీ వెనక్కి తిరిగి 'నీకు లేని అధికారాన్ని నీవు ప్రదర్శించలేవు..' అంటూ హెచ్చరించారు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఆ యువకుడు ఏమన్నాడంటే...
విజయసాయి రెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయాక ఆ యువకుడు మీడియాతో మాట్లాడారు. పోస్కోతో జరిగిన చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అది గత ప్రభుత్వంలో జరిగినా... ఇప్పటి ప్రభుత్వ హయాంలో జరిగినా... ముందు దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. దానికి విజయసాయి రెడ్డి 'ఒప్పందం ఎవరు చేసుకున్నారు..' అంటూ ఎదురు ప్రశ్నించారని చెప్పారు. అధికారంలో ఉన్నవారికి కూడా తెలియకపోతే ఎంక్వైరీ చేసుకోవాలని తాను చెప్పానని అన్నారు. ఆ పోస్కో చట్టాన్ని రద్దు చేస్తేనే విశాఖ ఉక్కు ఉద్యమానికి వైసీపీ అసలైన సంఘీభావం ప్రకటించినట్టు అన్నారు. అప్పటిదాకా ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదన్నారు.