దొంగల బ్యాచ్! తనివితీరా ఏడవండి పార్టనర్లూ: చంద్రబాబు, పవన్పై విజయసాయి సెటైర్లు
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాులు సంధించారు. ట్విట్టర్లో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా పరోక్ష విమర్శలు చేశారు.
దొంగల బ్యాచ్..
‘మతం మార్చడానికే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కుల మీడియా, చంద్రబాబు, ఆయన దొంగల బ్యాచ్ గోల పెట్టడం 5 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. వీళ్ల నీచ ఆరోపణలతో 1.80 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 50 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనస్తాపానికి గురయ్యారు' అని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఏడవండి పార్టనర్లూ..
‘మద్య నిషేధంపై అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశలో ఆంధ్రప్రదేశ్ సీఎం గారు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను 40 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించారు. బెల్టుషాపులు ఎగిరిపోయాయి. మద్యం విక్రయాల సమయం తగ్గింది. ఇక తనివితీరా ఏడవండి పార్టనర్లూ' అని చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్పైనా విజయసాయి విమర్శలు చేశారు.
అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలా?
‘మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట. మీ బంధువైతే ఇంటికి పిలిచి మర్యాదలు చేయండి చంద్రబాబు గారూ. ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే. పోలీసులకు పచ్చ యూనిఫామ్ వేసిన చరిత్ర మీదే' అని చంద్రబాబుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి. కాగా, ‘వాల్తేరు డివిజన్ను యధావిధిగా విశాఖపట్నంలోనే కొనసాగించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని బుధవారం రాజ్యసభ జీరో అవర్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది' అని విజయసాయి తెలిపారు.