విశాఖలో ప్రారంభమైన విజయసాయి రెడ్డి పాదయాత్ర... సాయంత్రం భారీ బహిరంగ సభ...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం(ఫిబ్రవరి 20) విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకూ 22కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం విజయసాయి తన పాదయాత్రను ప్రారంభించారు.మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు కూడా పాదయాత్రలో విజయసాయి వెంట నడుస్తున్నారు.
సాయంత్రం సమయంలో కూర్మన్నపాలెం జంక్షన్లోని స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చ్ వద్ద పాదయాత్ర ముగియనుంది. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో విజయసాయి,వైసీపీ నేతలు ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికలకు మద్దతుగా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఆదేశాల మేరకే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్ల తరహాలో విశాఖ స్టీల్ ప్లాంటుకు కూడా సొంత గనులు కేటాయించడం,రుణాలను ఈక్విటీ రూపంలోకి మార్చాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయాలని సీఎం నిర్ణయించారు.
స్టీల్ ప్లాంట్ నష్టాలకు ఉద్యో గులు కారణం కాదని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు కేటాయించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి.త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం దేశ ద్రోహమేనని విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని ఇప్పటికే విశాఖ ఉక్కు ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది.