మహానాడులో ఏడుపు తీర్మానాలు; నాలుకా తాటిమట్టా? ఉన్మాది చంద్రబాబు: ఏకిపారేసిన సాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతుంటే వైసిపి నేతలు సైతం తీవ్ర స్థాయిలో చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదం చేస్తే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కిక్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. అంతేకాదు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను టార్గెట్ చేసి చంద్రబాబు తీరును ఎండగట్టారు.
మహానాడులో ఏడుపు తీర్మానాలు అంటూ టార్గెట్ చేసిన సాయిరెడ్డి
మహానాడులో ఏడుపు తీర్మానాలను చేశారని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి మహానా(పా)డులో ఏడు(పు) తీర్మానాలు అంటూ పేర్కొన్నారు. బాదుడే-బాదుడు సిద్ధాంతకర్త ఉన్మాది చంద్రబాబును అనేక చోట్ల ప్రజలు నిలదీశారని విజయ సాయి రెడ్డి విమర్శించారు. మీహయాంలో 3సార్లు కరెంటుఛార్జీలు పెంచారు. విద్యుత్ సంస్థలపై 70 వేల కోట్ల భారం మోపలేదా అని ప్రశ్నించారు. ఏదో విజయం సాధించినట్టు మహనాడులో తీర్మానాలు సంబరాలు. అంతా మాయ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
రైతులపై తీర్మానంతో ఊసరవెల్లులు సిగ్గు పడుతున్నాయి
"వ్యవసాయం దండగ" అనే కొరగాని సిద్ధాంతం 20 ఏళ్ల క్రితమే రచించిన ఉన్మాది చంద్రబాబు అంటూ మండిపడ్డారు. మహానాడులో రైతులఫై తీర్మానంతోఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయని విజయసాయి వ్యాఖ్యానించారు. రైతుల రుణమాఫీ హామీతో 2014లో గెల్చిన బాబు కేవలం 15% మాత్రమే చెల్లించాడు. మొత్తం మాఫీ చేస్తానని అనలేదని అంటాడు నిత్యఅబద్ధాలకోరు అని చంద్రబాబును టార్గెట్ చేశారు.
రైతుభరోసాతో వ్యవసాయం పండుగ అయ్యిందని తీర్మానం చెయ్యి బాబు
హామీలు ఇచ్చేది మోసం చేసేందుకే కాని నెరవేర్చడానికి కాదు అని ఉన్మాది చంద్రబాబు నిరూపించుకున్నాడు. 1513 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే 391 కుటుంబాలకే పరిహారం చెల్లించాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా 50.10 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున ఇప్పటి వరకు రూ.24 వేల కోట్లు నేరుగా ఖాతాల్లో వేసింది జగన్ గారి ప్రభుత్వం అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ పథకం వల్ల వ్యవసాయం పండగగా మారిందని మహానాడులో తీర్మానం చేసి పెద్ద మనసు చాటుకో బాబూ. మంచిని అభినందించడం నేర్చుకో బాబు అంటూ హితవు పలికారు.
మహానాడులో దాడులు పెరిగాయని తీర్మానించడానికి సిగ్గులేదా?
పరిటాల ఫ్యాక్షన్ హత్యకు గురైతే ఏ జిల్లాలో ఎన్ని బస్సులు తగలబెట్టాలో టార్గెట్లు ఇచ్చింది ఉన్మాది చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇప్పడు మహానాడులో దాడులు పెరిగాయని తీర్మానించడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు పత్తికొండ వై ఎస్ ఆర్ సి పి ఇన్ ఛార్జి నారాయణరెడ్డితో సహా మా కార్యకర్తలు 30 మందిని నరికి చంపించిన పాపం నీదే! అంటూ విజయసాయిరెడ్డి దాడులపై మహానాడులో చేసిన తీర్మానాన్ని తిప్పికొట్టారు.
దోచుకోవాలి, వ్యవస్థల అండతో బయటపడాలి అనేది బాబు రాజనీతి
పాలించే అర్హత లేదు. అసమర్థ ప్రభుత్వం' ఉన్మాది చంద్రబాబు ఉవాచ అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి ఈ విమర్శల అర్థం: అవినీతికి అవకాశం లేకుండా లబ్దిదారుల ఖాతాల్లో నిధులు వేయడం, రివర్స్ టెండర్లతో ఆదా చేస్తే బాబులాంటి అవినీతిపరులు బతికేదెలా అని అడుగుతున్నట్టు అని కొత్త అర్థం చెప్పారు. దోచుకోవాలి, వ్యవస్థల అండతో బయటపడాలి అనేది బాబు రాజనీతి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు. పైగా వ్యయం పెంచి నీకింత-నాకింత అంటూ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు.
ఉన్మాది చంద్రబాబు.. నాలుకా తాటి మట్టా
'నాలుకా తాటిమట్టా' అనే మాట ఎలా పుట్టిందో కానీ ఉన్మాది చంద్రబాబు వల్ల అది బాగా పాపులర్ అయింది అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టి పోరాడారని 2018 మహానాడులో చెప్పుకొచ్చాడు. ఆ వెంటనేతెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన 'తాటిమట్ట' తనదేనని రుజువు చేసాడు చంద్రబాబు అంటూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజ మెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.