వైసీపీలో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు- సొంత పార్టీ నేతల్నే టార్గెట్- అవినీతే అస్త్రం
రాజకీయ నేతలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు విపక్షాలకు చెందిన తమ ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తుంటారు. తమపై ఆరోపణలు చేయకుండా వారి ముందరి కాళ్లకు బంధం వేసేందుకు ఎదురుదాడికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఏపీలో రాజకీయాలు మాత్రం విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ అధికార పార్టీ నేతలు విపక్షాలపై వాడాల్సిన అస్త్రాల్ని సొంత పార్టీ నేతపైనే వాడేస్తున్నారు. ముఖ్యంగా వారి అవినీతిని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సదరు ఆరోపణలపై ఎదురుదాడి చేయలేక, అలాగని అధిష్టానానికి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయలేక వారు సతమతం అవుతున్నారు. దీన్ని చూస్తున్న విపక్షాలు మాత్రం కాగల కార్యం గంధర్వులే తీరుస్తున్నారని పండగ చేసుకుంటున్నాయి.
వైసీపీలో లుకలుకలు..
ఏపీలో తొలిసారి అధికారం చేపట్టిన వైసీపీ సంఖ్యాపరంగా దుర్భేద్యంగా కనిపిస్తోంది. చట్ట సభలతో పాటు క్షేత్రస్ధాయిలోనూ ఆ పార్టీ నేతలకు ఎదురే లేకుండా పోతోంది. కరోనాకు ముందు మొదలైన స్ధానిక ఎన్నికల్లో సైతం ఈ బలంతోనే ఏకగ్రీవాలకు సైతం ప్రయత్నించింది. ఇప్పుడు టార్గెట్ చేయాల్సిన అవసరం లేనంతగా విపక్షాలు కూడా బలహీనంగా కనిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీలోని నేతలే పరస్పరం ప్రత్యర్ధులుగా మారిపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో టీడీపీని టార్గెట్ చేయాల్సిన వైసీపీకి ఆ అవసరం లేకపోవడంతో వారిలో వారే ఆరోపణలకు దిగుతున్నారు.
వైసీపీలో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు...
వైసీపీలో జరుగుతున్న ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేల పోరుకు తొలుత నరసాపురంలోనే బీజం పడింది. వైసీపీ తరఫున గెలిచిన రఘురామకృష్ణంరాజు పార్టీపై ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై విమర్శలు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పోరు దాడులకు కూడా దారి తీస్తుందన్న భయంతో రఘురామరాజు ఢిల్లీ వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత విశాఖలో విజయసాయిరెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్గా సాగిన పోరు కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన విశాఖ ఎమ్మెల్యేలను జగన్ పిలిపించుకుని క్లాస్ పీకి పంపారు. ఆ తర్వాత తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డీఆర్సీ భేటీలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిగా సాగిన వాగ్వాదం వైసీపీలో తీవ్ర చర్చకు తావిస్తోంది.
ఎంపీల జోక్యం సహించని ఎమ్మెల్యేలు..
వైసీపీలో ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి అదనంగా 22 మంది ఎంపీలున్నారు. వీరిలో ధిక్కార స్వరం వినిపిస్తున్న రఘురామరాజును మినహాయిస్తే 21 మంది ఎంపీలున్నారు. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న స్ధానాల్లో ఒక్కో చోట ఏడుగురు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల వీరి పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న ఎంపీ స్దానాల పరిధిని మినహాయిస్తే వైసీపీ ఎంపీలు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం ఆధిపత్య పోరు సాగుతోంది. తమ నియోజకవర్గాల పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో తమ మాటే నెగ్గాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందులో ఎంపీల జోక్యం సహించేందుకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సిద్ధంగా లేరు. దీంతో ఎంపీల పరిస్ధితి దయనీయంగా మారిపోతోంది.
Recommended Video
ఎమ్మెల్యేలపై ఎంపీల అవినీతి ఆరోపణలు..
తమ నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎంపీలను అనుమతించని ఎమ్మెల్యేల తీరుపై సదరు అధికార పార్టీ ఎంపీల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇది పలు సందర్భాల్లో రకరకాలుగా బయటికి తన్నుకొస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమల్లో ఎమ్మెల్యేల చేతివాటాన్ని, నియోజకవర్గాల్లో దందాలను ఎంపీలు బహిరంగంగానే ప్రశ్నించడం మొదలుపెట్టారు. విశాఖ జిల్లాలోని నియోజకవర్గాల్లో పరిస్ధితులపై ఎంపీ సాయిరెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలపై ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆయనకు కౌంటర్ ఇచ్చారు. తాజాగా కాకినాడ డీఆర్సీ సమావేశంలో టిడ్కో ఇళ్లలో అవినీతిపై ప్రశ్నించిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఎమ్మెల్యే ద్వారంపూడి అదే స్ధాయిలో కౌంటర్ ఇచ్చేశారు. దీంతో ఎంపీలు కంగుతినక తప్పడం లేదు. అలాగని ఎంపీలు ఈ వ్యవహారాన్ని అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లే పరిస్ధితి లేదు. కానీ మీడియాలో రచ్చ జరిగే సరికి అధినేత జగన్ గతంలో విశాఖ వైసీపీ ప్రజాప్రతినిధులను పిలిపించి మాట్లాడారు. కాకినాడ వ్యవహారంపై మాత్రం ఇప్పటివరకూ చడీచప్పుడూ లేదు. మరికొన్ని చోట్ల కూడా ఎంపీలతో ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు వైసీపీకి తలనొప్పిగా మారుతోంది.