నా అరెస్ట్తో ఉద్యమాన్ని ఆపలేరు: మందకృష్ణ మాదిగ, చలో అసెంబ్లీ ఉద్రిక్తం
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల సమయంలోనే... ఎమ్మార్పీఎస్ బుధవారం నాడు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మార్పీఎస్, నిరుద్యోగ ఐకాసలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నిరుద్యోగ యువత అసెంబ్లీ ముట్టడికి యత్నించింది.
దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దాదాపు నలభై మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అసెంబ్లీ వైపుకు దూసుకు వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు యూనివర్సిటీ వద్ద మరో 80 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
గోషామహల్ తదితర ప్రాంతాల వద్ద కూడా అరెస్టులు జరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అసెంబ్లీ వద్ద ఎమ్మార్పీఎస్, నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో.. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది.
ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడిక్కడ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. నగరంలో అనుమానితులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ కీలక నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు.
అనుమతి లేదు
ఎమ్మార్పీఎస్ చేపట్టిన చలో అసెంబ్లీకి అనుమతి లేదని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. నగరంలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని చెప్పారు. నిబంధలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనేక మార్గాలో వాహనాల మళ్లింపులు చేపట్టామని తెలిపారు.
మందకృష్ణ మాదిగ అరెస్ట్
చలో అసెంబ్లీ నేపథ్యంలో మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణ పైన చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. తన అరెస్టుతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.