'కులం' వ్యాఖ్యలు: చంద్రబాబుపై కేసు, వక్రీకరించారని వివరణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కులం వ్యాఖ్యలతో చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. ఆయనపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కృష్ణలంక, సూర్యారావుపేటలో చంద్రబాబుపై ఎమ్మార్పీయస్ నేతలు ఊటుకూరి రోజ్కుమార్, మానికొండ శ్రీధర్ ఫిర్యాదు చేశారు.
కాగా, తాను చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఢిల్లీలో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఎస్సీలపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఎస్సీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నదే తన ఉద్దేశమని, అంతే తప్ప వారిని కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీలు చాలా వెనకబడి ఉన్నారని మాత్రమే చెప్పానని, ఎవరూ పేదవాళ్లుగా ఉండాలని అనుకోరని, పేద కుటుంబాల్లో పుట్టాలని అనుకోరని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించారని వర్ల రామయ్య వంటి టిడిపి నేతలు కూడా అన్నారు.
కాగా, చంద్రబాబు వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఉప్పులేటి కల్పన, శ్రీనివాసులు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
ఎస్సీగా ఎందుకు పుట్టాలని అనుకోలేదో చంద్రబాబు చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతారా అని ఆమె ప్రశ్నించారు.