'తుని హింసాత్మక ఘటనకు జగనే కారణమైతే కేసెందుకు పెట్టలేదు?'
అమరావతి: కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తునిలో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక వైసీపీ అధినేత వైయస్ జగన్ ఉన్నారని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై కేసు ఎందుకు పెట్టలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ప్రశ్నించారు.
తుని హింసాత్మకం ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిందని మంద కృష్ణ నిందించారు. నిందితుడు వైయస్ జగన్ అయితే, కేసు పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా? అని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు కాపులకు ఇచ్చిన ఆ హామీని నెరవేర్చనందుకే ప్రజలు ఉద్యమ బాట పట్టారని అన్నారు. గతంలో ఇదే తరహాలో ఎస్సీ వర్గీకరణపైనా పలు హామీలిచ్చిన చంద్రబాబు, వాటిని మరచిపోయారని, కాపుల తరహాలోనే మాదిగ యువత కూడా ఉద్యమబాట పట్టనుందన్నారు.
మరోవైపు తునిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ప్రకటించారు. కాపు ఐక్య గర్జన సభ అనంతరం రైల్ రోకో, రాస్తారోకోకు దిగిన ఆందోళనకారులు 25 వాహనాలను, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ను తగలబెట్టిన సంగతి తెలిసిందే.
తుని రూరల్ పోలీస్ స్టేషన్, వాహనాల దగ్ధంకు పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని అన్నారు. ఈ హింసాత్మక ఘటనలో రైల్వే శాఖకు సుమారు 30 కోట్లు, పోలీస్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 35 కేసులు నమోదు చేశామని, ఆధారాలు సేకరిస్తున్నామని రవిప్రకాశ్ చెప్పారు.