నారావారిపల్లెలో యాత్ర టెన్షన్: మిర్యాలగుడాలో మందకృష్ణ అరెస్టు, ఎపికి తరలింపు
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గురువారం చిత్తూరు జిల్లా నారావారిపల్లె లో ఎమ్మార్పీఎఫ్ తలపెట్టిన విశ్వరూప చైతన్య యాత్ర నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గుంటూరుకు తరలించారు.
నారావారిపల్లెలో పోలీసులు భారీగా మోహరించారు. తిరుపతి, చంద్రగిరి సహా పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాత్రను నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్ నేతలు తేల్చి చెప్పారు. సభను అడ్డుకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హైకోర్టులో ఎమ్మర్పీఎస్ మందకృష్ణ మాదిగ పిటిషన్ వేశారు. నారావారిపల్లె నుంచి విశ్వరూప చైతన్యయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విశ్వరూప చైతన్యయాత్ర పై తగు నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు సూచించింది.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి స్వగ్రామం నారావారిపల్లెలో మందకృష్ణ మాదిగ విశ్వరూప యాత్రను తలపెట్టడం ఉద్రిక్తతకు కారణమైంది.
విశ్వరూప గర్జన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మందకృష్ణ మాదిగ నారావారిపల్లెకు వస్తే మారణహోమం తప్పదని ఎమ్మార్పీయస్ నాయకుడు గిరిధర్ మాదిగ హెచ్చరించారు. ఎమ్మార్పీయస్ నేతలు, టిడిపి దళిత నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఎమ్మార్పీయస్ నాయకుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ ఎపిలో అడుగు పెట్టడానికి వీలు లేదని గిరిధర్ అన్నారు. మందకృష్ణ మాదిగ సమైక్యాంధ్ర ద్రోహి అని విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకోవడానికి మందకృష్ణ మాదిగ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.