చంద్రబాబులో అసహనం: 'అందుకే జగన్తో నాకు లింక్ పెడుతున్నారు'
విశాఖపట్నం: తన వెనుక ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై మందకృష్ణ మాదిగ స్పందించారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ అంశంలో వైయస్ జగన్ పేరు వాడుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్గీకరణ పేరుతో గత రెండు దశాబ్దాలుగా ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. నా వెనుక వైసీపీ అధినేత జగన్ ఉన్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు చేశామని చెప్పుకొచ్చారు.
అప్పుడు నువ్వు మా వెనకాల ఉన్నావా? అంటూ చంద్రబాబును మందకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదంటూ ఆరోపించారు. ఇదిలా ఉంటే బుధవారం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మందకృష్ణ మాదిగ వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం.
మందకృష్ణ వైఖరిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిననట్లు తెలుస్తోంది. అసలు 'తెలంగాణకు చెందిన మందకృష్ణకు ఆంధ్రప్రదేశ్లో అసలేం పని ' అంటూ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీలో తాజా రాజకీయపరిణామాలపై చంద్రబాబులో అసహనం పెరిగిపోయి అచ్చం కేసీఆర్లా మాట్లాడారంటూ మీడియా కోడై కూస్తోంది.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేర్వేరు సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మందకృష్ణ వ్యవహారశైలిపై అలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
కాగా ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ గత కొన్నాళ్లుగా మందకృష్ణ పోరాడుతూనే ఉన్నారు. పోరాటాలకు మాత్రమే సారథ్యం వహిస్తారు గానీ, ఏ పార్టీ తరుపున కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. గతంలో చంద్రబాబుతో సాన్నిహిత్యం నెరపిన మందకృష్ణ ఈ మధ్య కాలంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.