వైఎస్ అవినీతికి పాల్పడలేదని నేనెప్పుడైనా చెప్పానా?...త్వరలో మార్గదర్శిపై మరిన్ని వాస్తవాలు:ఉండవల్లి
రాజమండ్రి: వైఎస్ రాజశేఖర్రెడ్డిపై అచంచల విశ్వాసం కనబర్చే కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ అవినీతికి పాల్పడలేదని తానెప్పుడైనా చెప్పానా?...అంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు.
అయితే వైఎస్ మనీ టేకింగ్ చేశారు...కానీ మనీ మేకింగ్ చేయలేదని చెప్పారు. అలాగే రాజా ఆఫ్ కరెప్షన్ బుక్పై తాను చర్చకు సిద్ధమని ఉండవల్లి ప్రకటించారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు...ప్రభుత్వ నుంచి జీతం తీసుకుంటూ టీడీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఈర్ష్య ఉంటే తాను అమరావతి వెళ్లి ఆయనను ఎందుకు కలుస్తానని ప్రశ్నించారు.
మార్గదర్శిపై త్వరలో మరిన్ని వాస్తవాలు బయటపెడతానని ఉండవల్లి ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్మీట్ పెట్టి అమరావతి బాండ్లపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ బాండ్లు ఎవరు కొన్నారో వారి పేర్లు బైటపెట్టాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అలాగే...ఈ బాండ్లకు చాలా ఎక్కువ వడ్డీలు ఇచ్చారని...బ్రోకర్ కు 17 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
ఉండవల్లి ఆరోపణలపై స్పందించిన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అమరావతి బాండ్లలో అవినీతి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. వారి పేర్లు వివరాలు కావాలంటే ఉండవల్లి ముంబాయి వెళ్లి సెబీ దగ్గర తీసుకోవాలని, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారి వివరాలన్నీ వారి దగ్గర ఉంటాయని.. అందులో రహస్యం ఏముటుందని ప్రశ్నించారు.
అదే సమయంలో... వైఎస్ హయాంలో ఏపీలో జరిగిన అవినీతిని గురించి కుటుంబరావు ప్రస్తావించారు. దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఉండవల్లికి సవాల్ చేశారు. అప్పట్లో వైఎస్ పై టీడీపీ "రాజా ఆఫ్ కరప్షన్" అనే పుస్తకాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే కుటుంబరావు సవాలుపై స్పందించిన ఉండవల్లి తాను "రాజా ఆఫ్ కరప్షన్" అనే పుస్తకంపై బహిరంగచర్చకు సిద్ధమని ప్రకటించి కుటుంబరావుకు సవాలును స్వీకరించడంతో పాటు కుటుంబరావుపైనే మరికొన్ని విమర్శలు చేయడం గమనార్హం.