ముద్రగడ వింత డిమాండ్: చేతులకు బేడీలు కట్టి, కళ్లకు గంతలు కట్టి..., ఎందుకు?
కాపు రిజర్వేషన్ల కోసం తాను చేయతలపెట్టిన సత్యాగ్రహ యాత్రకు అనుమతి తీసుకునేది లేదని ముద్రగడ పద్మనాభం అంటున్నారు. తన పాదయాత్రపై ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు.
కాకినాడ: తన చేతులకు బేడీలు కట్టి, కళ్లకు గంతలు కట్టి తన పాదయాత్రకు అనుమతించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నాడంటే...
కాకినాడ: తాను తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రకు తన చేతులకు బేడీలు వేసి, తన కళ్లకు గంతలు కట్టి అనుమతించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. కాపు నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రభుత్వం అంటున్నందున తన యాత్రకు అలా అనుమతించాలని ఆయన అన్నారు.
కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25 నుంచి చేపడతామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈ యాత్ర చేస్తామని చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కాకినాడలో రాష్ట్రస్థాయి కాపు జేఏసీ సమావేశం జరిగింది. 13 జిల్లాల నుంచి వచ్చిన కాపు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యమ కార్యాచరణపై రెండు గంటలపాటు ఆయనతో నాయకులు చర్చించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే డిమాండ్ను సాధించుకునేందుకు నాలుగు అంచెలుగా ఉద్యమం చేస్తామని చెప్పారు.
డిసెంబరు 18న నల్ల రిబ్బన్లు ధరించి కంచం, గరిటె చేతపట్టుకుని ఎక్కడివారు అక్కడే మోత మోగించి నిరసన తెలపాలని కోరారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి తాను ఏదో ఒక జిల్లాలో కార్యక్రమంలో పాల్గొని, 36 గంటలపాటు అక్కడే ఉంటానని చెప్పారు. డిసెంబరు 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు స్థానికంగా ఉండే కాపు నేతలు వినతిపత్రాలను అందజేస్తారని తెలిపారు.
జనవరి 9న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. గతంలో కాపు సత్యాగ్రహ యాత్రను తలపెట్టినప్పుడు దానిని అడ్డుకునేందుకు 9 వేలమంది పోలీసులను దించారని కాపు ఉద్యమ నాయకుడు ఆకుల రామకృష్ణ తెలిపారు.