నన్ను లాగొద్దు: పవన్ కళ్యాణ్కు ముద్రగడ, వామ్మో జగన్!: నెహ్రూ షాకింగ్
రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు. పవన్ తనను రాజకీయాల్లోకి లాగడం సరికాదని, తాను కాపు జాతి కోసం పోరాడుతున్నానని చెప్పారు.
కాపు రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఆగస్ట్ వరకు గడువు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకోకపోతే మరోసారి ఉద్యమిస్తానని హెచ్చరించారు. కాగా, ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో ముద్రగడ, తుని ఘటన పైన తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. దీంతో ముద్రగడ కౌంటర్ ఇచ్చారు.
జగన్ పైన జ్యోతుల షాకింగ్ కామెంట్స్
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా వైసిపి అధినేత జగన్ పైన షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ తన అభిప్రాయాలకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతకు ప్రజల గురించి అర్థం చేసుకునేంతలేదని అభిప్రాయపడ్డారు. ప్రజలను అర్థం చేసుకునే మనసు జగన్కు లేదన్నారు. అవగాహన లేని జగన్ వద్ద పని చేయలేక టిడిపిలో చేరానని చెప్పారు.
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు
గన్నవరం విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త టెర్మినల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విమానాశ్రయ ఆధునికీకరణ, సుందరీకరణ పనులు ఎలా జరుగుతుందీ? ఆయన తనిఖీ చేశారు.
అంతకుముందు ఆయన విశాఖలోని ఏయూలో నిర్వహించిన జ్యోతిరావు పూలే 190వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సమాజానికి మంచి చేసే నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి పూలే నిదర్శనమన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పూలే అహర్నిశలు పని చేశారన్నారు. ఆనాటి నాయకులను స్ఫూర్తిగా తీసుకున్నమహోవ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.