ముద్రగడ దీక్ష: దాసరిని అడ్డుకున్న పోలీసులు, 'రత్నాచల్' ప్రారంభం
రాజమహేంద్రవరం/విజయవాడ: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండుతో ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహార దీక్ష సోమవారం నాడు నాలుగో రోజుకు చేరుకుంది. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు చాలామంది తరలి వస్తున్నారు.
దర్శకరత్న దాసరి నారాయణ రావును పోలీసులు ఉదయం కిర్లంపూడి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాపుల కోసం దీక్ష చేస్తున్న ముద్రగడకు మద్దతుగా.. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు దాసరి కిర్లంపూడి వెళ్లేందుకు పయనమయ్యారు. అయితే ఆయనను పోలీసులు కృష్ణా జిల్లా నందిగామ వద్ద అడ్డుకున్నారు.
టిడిపి నేతల చర్చలు
ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావులు ముద్రగడతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా విశాఖలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలతో సీఎం నారా చంద్రబాబునాయుడు జరిపిన చర్చల సారాంశాన్ని వారు ముద్రగడకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తోట, బొడ్డులతో చర్చల తర్వాత కాస్తంత మెత్తబడ్డ ముద్రగడ దీక్ష విరమణకు దాదాపుగా అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావులు ముద్రగడతో చర్చించనున్నారు. మరోవైపు, చర్చలతో సంబంధం లేకుండా పోలీసులు అందరినీ ముద్రగడ ఇంటి నుంచి పంపిస్తున్నారు.
పట్టాలెక్కిన రత్నాచల్ ఎక్స్ప్రెస్
కాపు గర్జన హింసలో కాలి బూడిదైన రత్నాచల్ ఎక్స్ప్రెస్ వారం తర్వాత మళ్లీ పట్టాలెక్కింది. గత నెల 31న తునిలో జరిగిన కాపు గర్జనకు హాజరైన కొందరు దుండగులు రైలు పట్టాలపై పరుగులు పెడుతున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ పైన దాడికి దిగారు. రైలు బోగీలకు నిప్పు పెట్టారు.
ఈ ప్రమాదంలో రైలు మొత్తం కాలి బూడిదైంది. దీంతో విజయవాడ - విశాఖపట్నం మధ్య తిరుగుతున్న ఈ రైలు వారం పాటు రద్దయింది. బోగీలు దొరకని కారణంగా రత్నాచల్ను కొన్నిరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 17 బోగీలతో సరికొత్తగా రత్నాచల్ ఎక్స్ప్రెస్ను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. ఉదయం ఈ రైలు విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరింది.