ముద్రగడ దీక్ష విరమణ: నారా లోకేష్ చొరవతోనే పరిష్కారమా?
విజయవాడ: దీక్ష విరమణకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చొరవతోనే తొలిగిందనే ప్రచారం సాగుతోంది.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఈ ఏడాది కాపు కార్పోరేషన్కు వంద కోట్లు మాత్రమే కేటాయిస్తామని, అంతకు మించి కేటాయించలేమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దాంతో ముద్రగడ దీక్ష విరమించడానికి నిరాకరించారని చెబుతున్నారు. ఈ స్తితిలో ఏర్పడిన చిక్కుముడిని నారా లోకేష్ విప్పారని అంటున్నారు.
లోకేష్ జోక్యం చేసుకుని ఆ మొత్తాన్ని రూ.500 కోట్లకు పెంచేలా అప్పటికప్పుడు చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో సమస్య పరిష్కారమై, ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారని చెబుతున్నారు. ఇది ప్రభుత్వ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకోవడం కాదా అని గిట్టని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్టీ రామారావు హయాంలో లక్ష్మీపార్వతిని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జగన్ను రాజ్యేంగతర శక్తులుగా చిత్రీకరించినవారే నారా లోకేష్ జోక్యాన్ని ప్రశంసిస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రిగా తండ్రి ఉన్నంత మాత్రాన నారా లోకేష్ ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. నారా లోకేష్ ప్రభుత్వ సలహాదారు గానీ, శాసనసభ్యుడు గానీ కారని, అటువంటి స్థితిలో ఎలా జోక్యం చేసుకుంటారని అంటున్నారు.