చంద్రబాబుపై ముద్రగడ మాటలు: క్లైమాక్స్కు జగన్ అసంతృప్తి?
కాకినాడ: కాపుల సమస్యల పరిష్కారానికి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇచ్చిన క్లైమాక్స్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంగు తిన్నారనే మాట వినిపిస్తోంది. దీక్ష విమరించిన తర్వాత ఆయన చేసిన ప్రకటన జగన్ను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను తీవ్రమైన నిరాశకు గురి చేసినట్లు చెబుతున్నారు.
కాపు ఐక్య గర్జన సందర్భంలోనూ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలోనూ ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై మాటల ఈటెలు విసిరారు. తుని హింసాత్మక ఘటనల వెనక ప్రభుత్వం ఉందని ముద్రగడ ఆరోపించారు కూడా. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
దీక్ష విరమించిన తర్వాత ముద్రగడ చెప్పిన మాటలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇబ్బందిగా మారినట్లు భావిస్తున్నారు. ముద్రగడ మాటలు పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. వయస్సు మీరిపోతోందని, ఇదే చివరి దీక్ష అని, ఇక దీక్షలు చేయలేనని ముద్రగడ అన్నారు. దీనివల్ల దీక్షలోని తీవ్రత తగ్గిపోయిందని భావిస్తున్నారు.
చంద్రబాబుకు ముద్రగడ క్షమాపణలు కూడా చెప్పారు. చంద్రబాబు ఆస్తులపై, సంపాదనపై అంతకు ముందు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆ తర్వాత అలా మాట్లాడినందుకు క్షమించాలని కోరడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రుచించడం లేదు. "మిమ్మల్ని గానీ, మీ పార్టీని గానీ నిందించాలన్నది నా ఉద్దేశం కాదు. ఆవేశంలో ఏదైనా మాట తూలి ఉంటే క్షమించండి" అంటూ చంద్రబాబును ముద్రగడ వేడుకున్నారు.
అలాగే కాపులను బీసీల్లో చేరిస్తే మీ ఇంటికి వచ్చి మీ కాళ్లు కడుగుతా అని ముద్రగడ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ఈ రకమైన వ్యాఖ్యల వల్ల అంతకు ముందు తలెత్తిన రాజకీయ వేడి అంతా చల్లారిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.