టార్గెట్ చంద్రబాబు: మోత్కుపల్లితో ముద్రగడ భేటీ, ఏపీ ఆహ్వానానికి ఓకే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏపీ రాజకీయ పరిస్థితిపై చర్చ జరిగినట్లు సమాచారం.
తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి
తెలంగాణ మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై మోత్కుపల్లి నర్సింహులు టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు, విమర్శలతో చంద్రబాబును కడిగిపారేశారు.
ఏపీలో ఓడిస్తానంటూ..
అంతేగాక, ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, చంద్రబాబును ఓడించేందుకు తాను ఏపీలో ప్రచారం కూడా చేస్తానని మోత్కుపల్లి స్పష్టం చేశారు.
చంద్రబాబు లక్ష్యంగా..
ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం.. మోత్కుపల్లి నర్సింహులును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముద్రగడ పద్మనాభం కూడా కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వీరిద్దర ఏపీలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మోత్కుపల్లికి అన్యాయం
మోత్కుపల్లితో భేటీ సందర్భంగా ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. టీడీపీకి 30ఏళ్లుగా సేవ చేసిన సీనియర్ నేత మోత్కుపల్లికి అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. ఆయన మోత్కుపల్లికి బాసటగా నిలిచారు.
ముద్రగడ ఆహ్వానంతో.. ఏపీకి వస్తానంటూ మోత్కుపల్లి
అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించాలని ముద్రగడ పద్మనాభం ఈ సందర్భంగా మోత్కుపల్లిని కోరడం గమనార్హం. దీంతో మోత్కుపల్లి కూడా ముద్రగడ ఆహ్వానం మేరకు ఏపీలో పర్యటిస్తానని హామి ఇచ్చారు. ఇప్పటికే చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మోత్కుపల్లి ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఓటమికి కృషి చేస్తానన్న మోత్కుపల్లి.. ముద్రగడ ఆహ్వానాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.