తోకలు కట్ చేస్తారా?, ఏ సెంటరైనా తేల్చుకుందాం: బాబుపై ముద్రగడ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే అణిచివేస్తారా? అంటూ నిలదీశారు.
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే అణిచివేస్తారా? అంటూ నిలదీశారు. కేసుల్నే రిజర్వేషన్లుగా భావించమంటారా? అని ప్రశ్నించారు.
ఏ సెంటరైనా..
ముద్రగడ పద్మనాభం బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హామీలపై చర్చించేందుకు ఏ సెంటరుకైనా వస్తామని అన్నారు. రిజర్వేషన్లను కోరుతూ సభలు పెడితే నేరమా? అని ఆయన ప్రశ్నించారు.
జైలులో పెట్టినా..
తమ జాతి కోసం పోరాడతున్నామని తెలిపారు. తామేమీ దోపిడీదారులం కాదని అన్నారు. జైల్లో పెట్టినా వెనక్కి తగ్దేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. తోకలు కట్ చేయమని చంద్రబాబు ఆదేశించారట, 15లక్షలమంది తోకలు కట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
Recommended Video
మానుకుంటే మంచిది..
తమ జాతి కోసం పోరాటం చేస్తుంటే అణిచివేయడం సరికాదని, ఇది మానుకుంటే మంచిదని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో కులాలన్నింటికీ సమాన హక్కులుంటాయన్నారు.
పాదయాత్ర పక్కా..
13 జిల్లాల ప్రజలు తనను పాదయాత్ర చేయాలని కోరుతున్నారని ముద్రగడ చెప్పారు. జులై 26 నుంచి తన పాదయాత్ర నిరవధికంగా కొనసాగుతుందని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు.