చిరు గైర్హాజరు: 'హోటల్లో ఏం జరిగిందో బాబు చూడొచ్చు', ముద్రగడ సవాల్
హైదరాబాద్: తాటాకు చప్పుళ్లు కోసం తాను రోడ్డెక్కలేదని, కాపులను రిజర్వేషన్లను సాధించడం కోసమే రోడ్డెక్కామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం తీవ్రం చేసేందుకు తమ జాతి నేతలంతా సమావేశమయ్యామని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం కాపు నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ముద్రగడ తెలిపారు. గత నెల 11వ తేదీన 13 జిల్లాల పెద్దలతో తమ భవిష్యత్ కార్యాచారణ కోసం సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు.
ఆ సమావేశంలో తమ జాతి పెద్దలు ఇచ్చిన సూచనలు, సలహాలను తీసుకుని పెద్దలతో చర్చించామని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యం ఈ కార్యచరణను అమలు చేయడానికి జిల్లా జేఏసీలు, మండల జేఏసీలు వేసుకుని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత కార్యాచరణలో భాగంగా వివిధ దశల్లో నిరసన కార్యక్రమలు చేపడతామని అన్నారు.
ఇందులో భాగంగా 15 రోజులకొకసారి జిల్లాలకు వెళతామన్నారు. ఒకో పూట, ఒకో రోజు ఆయా గ్రామాల్లో బస చేస్తామని అన్నారు. అసవరమైతే ఇతర కులాలకు చెందిన పెద్దలను కూడా కలిసేందుకు తాము సిద్ధమన్నారు. ముందుగా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసి, ఆ తర్వాత కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
జాతి కోసం ఏకమయ్యేందుకు నేతలంతా సిద్ధమయ్యారని, వారి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తమ జాతిలో అట్టడుగున ఉన్న పేదవారి కోసం వారి బాధలను దృష్టిలో పెట్టుకుని పెద్దల అడుగు జాడల్లో నడుస్తామన్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు కాపు రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పండంతో తమలో చైతన్యం రగిలిందన్నారు.
అప్పట్లో తాము తీసుకొచ్చిన జీవోను పక్కన పెట్టడానికి తోడు, ఓటమిపాలు కావడంతో 20 ఏళ్ల పాటు ఉద్యమానికి దూరంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు మళ్లీ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడంతోనే తాను ఉద్యమం మొదలు పెట్టానని ఆయన తెలిపారు. ఇతరుల రిజర్వేషన్ కోటా తగ్గించమని కోరడం లేదని ఆయన తెలిపారు.
అందరూ అనుభవించగా మిగిలిన భాగంలో కొటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో వెనుకంజ వేసే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ కులంలో చిచ్చుపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తమ సోదరులతోనే తిట్టిస్తున్నారని ఆయన తెలిపారు.
వారు తిట్టినంత మాత్రాన తమ పరువులు పోవని ఆయన అన్నారు. తాను మొలతాడు తీసేసి ఉన్నానని, దేనికైనా రెడీగా ఉన్నానని ఆయన చెప్పారు. అనంతరం దాసరి నారాయణ రావు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ సమవేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాపు రిజర్వేషన్ పోరాటంలో భాగమవుతామని అన్నారు.
ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు భవిష్యత్ ప్రణాళిక రచించామని అన్నారు. ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, రిజర్వేషన్లు సాధిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో ఏం చేయదలచుకున్నది, ఈ ఉద్యమాన్ని ఏ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానిపై ఈ భేటీలో చర్చించామన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ముద్రగడ మీకు తెలియజేస్తారని, అంతేకాదు తెలియజేయాల్సిన అవసరం కూడా లేదన్నారు.
ఈ హోటల్లో సమావేశంలో సీసీటీపీ పుటేజీలను ఏర్పాటు చేశారని, ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో చంద్రబాబు నేరుగా చూడొచ్చని ఎద్దేవా చేశారు. ముద్రగడ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, సినీ నటి హేమ తదితరులు పాల్గొన్నారు.