బాబుపై యుద్దానికి కాపులు: పాదయాత్రతో అమీ తుమీ తేల్చుకునేందుకు ముద్రగడ రెడీ!..
ఈ నేపథ్యంలోనే 'ఛలో అమరావతి' పేరిట ముద్రగడ పాదయాత్రకు పిలుపునిచ్చారు. జూలై 26న తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోమారు ప్రభుత్వంపై పోరుకు సిద్దమయ్యారు. ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకునేందుకు మరో దఫా ఉద్యమానికి ఆయన సన్నద్దమవుతున్నారు. కాపు రిజర్వేషన్లపై అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి మరోసారి కాపు సెగ రుచి చూపించాలని ఆయన భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే 'ఛలో అమరావతి' పేరిట ముద్రగడ పాదయాత్రకు పిలుపునిచ్చారు. జూలై 26న తన స్వగ్రామం కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కాపు ఉద్యమం ప్రారంభమై వచ్చే జూలై 26నాటికి రెండేళ్లు పూర్తి కావస్తోందని, ఈ నేపథ్యంలోనే ఛలో అమరావతి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేరుస్తామన్న చంద్రబాబు హామిపై నిలదీసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు ముద్రగడ తెలిపారు. కాపు రిజర్వేషన్ల పరిశీలన కోసం వేసిన మంజునాథ్ కమిటీ 13జిల్లా పర్యటన ఎప్పుడో పూర్తయిందని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.
ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు ఎన్ని లేఖలు రాసినా అతీ గతీ లేదన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే చంద్రబాబుకు ప్రభుత్వంపై ఉన్న అక్కసు అర్థమవుతోందన్నారు. తాను చేపట్టబోయే నిరవధిక పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే సీఎంకు పంపిస్తామని ముద్రగడ తెలియజేశారు.