బాబుకు డెడ్ లైన్: ఆలోగా అమలవకపోతే!, ముద్రగడ హెచ్చరిక, అసలు పరిస్థితి ఇదీ..
కాకినాడ: గత 2014ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ఏపీ ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
కాపులకు రిజర్వేషన్లతో ఏపీలో మొత్తం రిజర్వేషన్లు 55శాతం అయ్యాయి. పెరిగిన రిజర్వేషన్లు అమలు కావాలంటే పార్లమెంటు అందుకు అంగీకరించాలి. కాబట్టి చంద్రబాబు సర్కార్ కాపులకు రిజర్వేషన్లు తీర్మానం చేసినంత మాత్రానా అవి అమలవుతాయా? అన్నదే పెద్ద ప్రశ్న.
ఇప్పుడిదే అనుమానాన్ని అటు కాపు సామాజిక వర్గం కూడా లేవనెత్తుతోంది. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ అంశంపై స్పందించారు.
అదే డెడ్ లైన్:
కాపు రిజర్వేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎదురుచూస్తామని, అప్పటికీ కాపు రిజర్వేషన్లు అమలు కాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ముద్రగడ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన కాపు జేఏసీ కార్యాచరణ సదస్సులో ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు. 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఊహించినట్లుగానే చంద్రబాబు బంతిని మోడీ కోర్టులోకి నెట్టేశారు
అదే నా ఆశ:
'పేద వారికి రిజర్వేషన్లు కావాలన్నది నా ఆశ. ఆర్థికంగా వెనుకబడ్డవాళ్లకు చేయూత దొరకాలంటే రిజర్వేషన్ కచ్చితంగా ఉండాలి.కాపు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ.. బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్ తగ్గకూడదు. బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండానే కాపు రిజర్వేషన్లు అమలుచేయాలన్నది మా ప్రధాన డిమాండ్. ఏళ్ల తరబడి కోరుతున్నా కాపు రిజర్వేషన్లపై ముందడుగు పడటం లేదు. ఉద్యోగ, ఇతర రంగాలతో పాటు, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలి. అలా జరిగితే అందరికీ సమాన అవకాశాలుంటాయి' అని ముద్రగడ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు మోసం చేస్తే:
కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం చంద్రబాబు తమను మోసం చేస్తే ఆయన్ను కూడా మోసం చేసే రోజు వస్తుందని హెచ్చరించారు. కాపు జనాభాను తగ్గించి రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
నిర్ణయం కేంద్రం చేతిలో:
రిజర్వేషన్లు పార్లమెంటు ద్వారా జరిగితేనే వాటికి చట్టబద్దత ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం హామిలు గుప్పించి.. తీరా కోర్టులు ప్రభుత్వ తీర్మానాలను కొట్టేసిన తర్వాత భంగపడిన సందర్భాలున్నాయి.
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో అదే జరిగింది. న్యాయస్థానం ఆ రిజర్వేషన్లను తిరస్కరించడంతో.. మరో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం దానిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందన్నది ఎవరికీ తెలియదు.
ఇక ఏపీ విషయానికొస్తే.. అసలే చంద్రబాబుకు కేంద్రంతో గ్యాప్ ఏర్పడినట్లు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. పోలవరం విషయంలో ఆ గ్యాప్ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పంపించిన తీర్మానం పట్ల కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా? అన్నది అనుమానమే.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు కొనసాగుతుందో.. లేదో చెప్పలేని పరిస్థితుల్లో కాపు రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా?.. అంటే ప్రతికూల సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాబట్టి కాపు రిజర్వేషన్ల బిల్లు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.