కాపు ఉద్యమానికి ముద్రగడ గుడ్ బై... ప్రత్యర్ధుల విమర్శలపై ఆవేదన- నష్టపోయానంటూ లేఖ
దాదాపు రెండు దశాబ్దాలుగా ఏపీలో కాపు ఉద్యమాన్ని నడిపిన సీనియర్ రాజకీయ వేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యర్ధుల ఆరోపణలపై ఆవేదన చెందుతున్నట్లు తాజాగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు.
ఇందులో కాపు ఉద్యమం తీరు, ప్రస్తుతం తన మౌనానికి గల కారణాలు, పరిస్ధితుల ప్రభావం, ప్రత్యర్ధుల విమర్శలపై చాలా విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో కాపు ఉద్యమం నడిపిన ముద్రగడ.. జగన్ అధికారం చేపట్టగానే మౌనంగా ఉన్నట్లు ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శల కారణంగానే ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాపు ఉద్యమానికి ముద్రగడ బై....
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో ఉంటూనే కాపు ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన ముద్రగడ పద్మనాభం తాజాగా కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన నిర్ణయానికి గల కారణాలను అభిమానులు, కాపులకు వివరిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో ఉద్యమంలో తాను ఎంతగా శ్రమించినా ప్రత్యర్ధులు తనను టార్గెట్ చేస్తూ కొన్నిరోజులుగా సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో చేస్తున్న విమర్శల కారణంగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇంత సడెన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న చర్చ సాగుతోంది.
ప్రత్యర్ధుల విమర్శలపై ఆవేదన..
కాపులకు తాజాగా ముద్రగడ రాసిన లేఖలో ఉద్యమం రావడానికి, ప్రస్తుతం సైలెంట్ గా ఉండటానికి గల కారణాలను వెల్లడించారు. తాను ఉద్యమంలోకి రావడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబే అని, ఉద్యమం వల్ల తాను ఆర్ధికంగా, రాజకీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోయానని ముద్రగడ తెలిపారు. కానీ ఉద్యమంలో ఉన్న కొందరు గతంలో తాను ఒంటికాలిపై లేచే వాడినని, ఇప్పుడు రెండు కాళ్లు చల్లబడిపోయాయని కామెంట్లు చేయడం బాధించిందన్నారు. ఈ మేరకు సోషల్, ఎలక్ట్ర్రానిక్ మీడియాలో తనపై జరుగుతున్న దాడులను ఆయన ప్రస్తావించారు. గతంలో మేధావులతో కలిసి ఉద్యమం నడిపానని, కానీ తాను బంతిని కోర్టులో వేశానని అనడం బాధిస్తోందని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. జాతికి మేలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు తాజా లేఖలో ఆయన చెప్పుకొచ్చారు.
Recommended Video
ఆకస్మికంగా తప్పుకోవడం వెనుక ?
గతంలో చంద్రబాబు హయాంలో కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాలని ఉద్యమం మొదలుపెట్టారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. ఓ దశలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబసభ్యులనూ చంద్రబాబు ప్రభుత్వం హౌస్ అరెస్టు చేసింది. చివరికి ఏమీ తేలలేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు కేంద్రం ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం ఇవ్వాలనే ఓ అసంబద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా అమలు కాలేదు. చివరికి జగన్ కూడా ఇది కేంద్రం చేతుల్లో ఉన్న అంశమని, కాపుల డిమాండ్ కు తాను కూడా మద్దతిస్తానని మాత్రమే చెప్పారు. దీంతో ఇక చేసేది లేక ముద్రగడ మౌనంగా ఉంటున్నారు. దీన్ని టీడీపీకి అనుకూలంగా ఉండే కొందరు తప్పుబట్టడంతో ముద్రగడ ఆవేదనతో ఉద్యమానికి గుడ్ బై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.