కోలుకున్న ముద్రగడ.. రాజమండ్రి ఆసుపత్రిలో స్వీట్ల పంపిణీ
రాజమండ్రి : ఆమరణ దీక్ష సందర్బంగా తనకు మెరుగైన సేవలు అందించిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. అంతేకాదు, ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్యంపై కనబరిచిన శ్రద్దకు ప్రతీ వైద్యున్ని పేరు పేరునా పలకరిస్తూ.. వెంట తీసుకెళ్లిన స్వీటు బాక్సులను వారికి అందజేశారు.
14 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభం, ఆరోగ్యపరంగా కాస్త కోలుకోవడంతో సోమవారం నాడు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరిండెంట్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ముద్రగడ ఆసుపత్రి సేవలను కొనియాడినట్టు తెలుస్తోంది. అలాగే ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్య కార్మికులను కూడా పలకరించిన ఆయన.. వాళ్లకు రూ.3 వేల ఆర్థిక సహాయంతో పాటు స్వీటు బాక్సులు అందజేశారు.
ప్రత్యేకించి ఆసుపత్రి సిబ్బందిని కలవడానికే రాజమండ్రి వెళ్లిన ఆయన, ఆసుపత్రి సిబ్బందిని తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఇకపోతే కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే.. మునుపటిలా దీక్షలు కాకుండా ప్రజాపోరాటం చేయక తప్పదని ముద్రగడ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆసుపత్రి సిబ్బందిని పలకరించిన అనంతరం.. తన ఆరోగ్యం గురించి మాట్లాడిన ముద్రగడ, తాను పూర్తిగా కోలుకున్నట్టుగా తెలియజేశారు. తనతో పాటు దీక్ష చేసిన తన కుమారులు, కోడలు కూడా పూర్తిగా కోలుకున్నారని ప్రకటించారు. అయితే తన భార్య మాత్రం ఇంకా గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నట్టు వెల్లడించారు.
ముద్రగడకు ఉండవల్లి పరామర్శ
ముద్రగడ పద్మనాభంను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం నాడు పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లిన ఉండవల్లి దాదాపు గంటసేపు చర్చించారు. ముద్రగడ, ఆయన భార్య, కోడలు ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీశారు.