చంద్రబాబును ఏదో జబ్బు వేధిస్తోంది...ఇండియాలో మందు లేదు:ముద్రగడ పద్మనాభం
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో పలు విమర్శలు,ఆరోపణలు చేశారు.
తనను ఎవరైతే ఎదిరిస్తారో వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉందని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. బురద చల్లడం చంద్రబాబుకు కొత్తేం కాదని మండిపడ్డారు. ఇతర పార్టీల సహకారంతో తాను ఉద్యమం చేస్తున్నానని తనపై కూడా చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారన్నారు.
ఏదో జబ్బు...అందుకే దురలవాటు
ముఖ్యమంత్రి చంద్రబాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఆయనకు ఈ దురలవాటు వచ్చి ఉంటుందని ముద్రగడ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే భారతదేశంలో చంద్రబాబు రోగానికి మందు లేదని, అందుచేతే ఆ జబ్బు బాగా ముదిరిపోయిందని ముద్రగడ ఎద్దేవా చేశారు.
తిరుమలపై...విచారణ కోరాలి...
చంద్రబాబుకు లేఖ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈమేరకు విచారణ కోసం ప్రధానిని చంద్రబాబు కోరాలని ముద్రగడ సూచించారు.
ముద్దాయిగా...తేల్చండి
తరచూ బాబు నిప్పు అని చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే విచారణకు ముందుకు రావాలన్నారు. ఇతర పార్టీల సహకారంతో తాను ఉద్యమం చేస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంతైనా నిజం లేదని ముద్రగడ ఖండించారు. తనపై ఆరోపణలకు తాను విచారణకు ముందుకు వస్తానని...సిఎం వద్ద ఆధారాలు వుంటే అవి బయటపెట్టి తనని ముద్దాయిని చేయాలని...అలా చేస్తే ఎవరి నిజస్వరూపం ఏంటనేది లోకానికి తెలుస్తుందన్నారు.
పూజరికి...సమాధానం చెప్పండి
లోకేష్కు మంత్రి పదవిపై ఓ పూజారి ప్రశ్నించారని, కానీ ఆ పూజారి అడిగిన ప్రశ్నకు ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ముద్రగడ నిలదీశారు. వంశపారపర్యంగా అర్చకత్వం ఉండకూడదన్న చంద్రబాబు, తన రాజకీయ వారసుడిగా తెచ్చిన లోకేష్కు ఈ నియమం ఎందుకు వర్తింపచేయడం లేదని ముద్రగడ ప్రశ్నించారు.