చంద్రబాబుకు ముద్రగడ ఆఫర్: చక్రం తిప్పుతున్న తోట త్రిమూర్తులు
రాజమండ్రి: కాపులను బీసీలలో చేర్చాలనే డిమాండుతో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శక్రవారం నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రభుత్వం తనతో చర్చలు జరిపి అవి సఫలమైతే నిర్ణయం తీసుకుంటానని అతను చెబుతున్నారు.
ముద్రగడ దీక్షను ఎలాగైనా విరమింప చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కాపుల కోసం కమిషన్ వేసిన విషయాన్ని, కాపులకు ప్రత్యేక నిధులు ఇస్తున్న విషయాన్ని చెబుతోంది. ముద్రగడతో చర్చలకు టిడిపి ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బొండా ఉమ సిద్ధమయ్యారు.
తన డిమాండ్లకు ప్రభుత్వం సరేనంటే ముద్రగడ దీక్షను విరమించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆయన డిమాండ్లకు ఒకే చెప్పే పరిస్థితి ఉందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులను ముద్రగడకు అర్థమయ్యేలా చెప్పేందుకు తోట, బొండ ఉమలు రంగంలోకి దిగారు.
ముఖ్యంగా తోట త్రిమూర్తులు భుజంపై చంద్రబాబు భారం మోపారు. చంద్రబాబు ఆదేశాలతో బుధవారం రాత్రి నుంచే ఆయన రంగంలోకి దిగారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల కాపు నేతలతో భేటీ అయ్యారు. అన్ని వివరాలు తెలిపారు. ముద్రగడ దీక్షను విరమించేలా తోట ప్రయత్నాలు చేయనున్నారు. తోట.. ముద్రగడ ఇంటికి వెళ్లారు.
మరోవైపు ముద్రగడ కూడా ఓ మెట్టు దిగారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని, తన వద్దకు వస్తే మాట్లాడుతానని, తన ప్రతిపాదన చెబుతానని, చర్చల్లో తన జాతికి న్యాయం జరుగుతుందనిపిస్తే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే, ప్రభుత్వం ముందు ఆయన డిమాండ్లు పెడుతున్నారు. కాపులకు ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున రెండేళ్లకు రెండువేల కోట్లు, కమిషన్ గడువు తగ్గించాలని ముద్రగడ చెబుతున్నారు.
గురువారం తోట మాట్లాడుతూ... కాపులకు రిజర్వేషన్ చాలా సున్నితమైన అంశమని, 1.30 కోట్ల మంది కాపుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టవలసి ఉందని, ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల కాపులతో సమావేశమయ్యామని చెప్పారు.
దీక్ష యోచనను ముద్రగడ విరమించుకోవాలని, సమస్య పరిష్కారం ముఖ్యమని, కానీ కాల పరిమితి ముఖ్యం కాదన్నారు. ఆ దిశగా ఉద్యమ నేతలు ఆలోచన చేయాలని, తున సభలో కాపులు తమ ఆవేదన చెప్పారని, తుని సభ ప్రభుత్వానికో, ఏ ఒక్క పార్టీకో వ్యతిరేకం కాదన్నారు.
బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి రిజర్వేషన్లకు భంగం కలగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, అంత దాకా వేచి చూడాలన్నారు.