రేపు ముద్రగడ ఇంటికి చిరంజీవి, ప్లేటుపై గరిట... జక్కంపూడి విజయలక్ష్మి అరెస్ట్
రాజమహేంద్రవరం: కాపు ఉద్యమం ఉధృతం అవుతోంది. మాజీ మంత్రి, కాపు నేత ముద్రగ పద్మనాభం చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆయనకు కాంగ్రెస్, వైసిపిలు మద్దతు తెలుపుతున్నాయి. రాజ్యసభ సభ్యులు చిరంజీవి రేపు (సోమవారం) కిర్లంపూడి రానున్నారు.
ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు చిరంజీవి కిర్లంపూడి రానున్నారు. ముద్రగడ దీక్షకు మద్దతు పలికిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడనున్నారు.
పిఠాపురంలో చెవిలో పువ్వుతో నిరసన
పిఠాపురంలో చెవిలో పువ్వులతో కాపులు నిరసన తెలిపారు. చాలాచోట్ల కాపులు తమకు అన్నం పెట్టాలంటూ చంద్రబాబును కోరుతూ పల్లెంను కొడుతూ నిరసన తెలిపారు. అనంతారంలో మహాత్మా గాంధీ విగ్రహానికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు.
మాజీ మంత్రి జక్కంపూడి సతీమణి విజయలక్ష్మి అరెస్ట్
మాజీ మంత్రి జక్కంపూడి సతీమణి విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరితూ కంచంపై గరిటెతో కొడుతూ నిరసన తెలిపారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ ఇంటి వద్ద మహిళలు నిరసన తెలిపారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలో మూడు రోజులుగా ఒక్క పొయ్యి కూడా వెలగలేదట. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆయన సొంతూరైన కిర్లంపూడి వాసులు అందరూ సంఘీభావంగా ముద్ద ముట్టడం మానేశారు.
ఆ గ్రామంలోని అన్ని సామాజిక వర్గాల వారు నిరాహార దీక్షలు చేస్తున్న కారణంగా ఏ ఇంటిలోనూ వంటావార్పు జరగడం లేదట. ఒక్క కాపు సామాజిక వర్గానికే కాక గ్రామంలోని ఏ సామాజిక వర్గానికి చెందిన వారికైనా, ఏ సమస్య వచ్చినా ముద్రగడ వేగంగా స్పందిస్తారట. ఈ కారణంగానే ఆయననే తమ నేతగా పరిగణిస్తున్న గ్రామస్థులు మూడు రోజులుగా అన్నం ముద్ద ముట్టకుండా ముద్రగడకు సంఘీభావంగా దీక్షల్లో పాల్గొంటూ ప్లేట్లపై గరిటెలతో శబ్ధం చేస్తూ హోరెత్తిస్తున్నారు.
చంద్రబాబు భేటీ
ముద్రగడ దీక్ష నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడు, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, విజయవాడ ఎమ్మెల్యే బోండ ఉమలతో భేటీ అయ్య్రారు.