ఆ దుర్మార్గుడు అడుక్కున్నాడు, మీ ఫ్యామిలీని లాగడం వెనుక కుట్ర ఇదీ, ఇంటి ముఖం చూడకు: పవన్కు ముద్రగడ
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీని సముద్రంలో నిమజ్జనం చేసే వరకు నిద్రపోవద్దని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. పవన్ చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఆయన ఓ లేఖ రాశారు.
చదవండి: శ్రీరెడ్డి ఇష్యూ మలుపు: పోలీసులు చెప్పడంతోనే వెళ్లిపోయిన పవన్, రాధాకృష్ణ తర్వాత శ్రీనిరాజు సై!
ఒక మెట్టు దిగి అవకాశం ఉన్నంతలో ఇతర పార్టీల సహకారం తీసుకొని చంద్రబాబుకు తగిన విధంగా బుధ్ది చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014లో కాపు జాతిని, మిమ్మలను అడుక్కొని అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అడుక్కొని అధికారంలోకి వచ్చాక మొదట దళితులను టార్గెట్ చేసి పోలీసులతో కొట్టించారన్నారు.
చదవండి: ఆపరేషన్ గరుడ ఆగలేదు, పవన్ అడుగుతున్నారు కానీ చిరంజీవి ఎలా వచ్చారు: శివాజీ
ఇలాంటి దుర్మార్గుడిని భుజాలపై ఎక్కించుకొని ఊళ్లు తిప్పారు
కాపులకు బీసీ రిజర్వేషన్ హామీ పైన చంద్రబాబు హామీ ఇచ్చారని, ఆయన ఇచ్చిన హామీని అమలు చేయమని కోరితే తన భార్య, తన కోడలిని పట్టుకొని ఈడ్చుకు వచ్చారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గుడిని తమరు భుజంపై ఎక్కించుకొని ఊళ్లు తిప్పి అపర మేధావి, కొత్త రాష్ట్రానికి పరిపాలనాదక్షుడు అంటూ ప్రజలకు పరిచయం చేసి పట్టాభిషేకం చేయించారన్నారు.
సముద్రంలో నిమజ్జనం చేయండి
మీ అమ్మగారికి జరిగిన అవమానం పక్కన పెట్టి రోడ్డు మీదకు వచ్చి ఆ పార్టీని సముద్రంలో నిమజ్జనం చేసే వరకు ఇంటి ముఖం చూడవద్దని పవన్ కళ్యాణ్కు ముద్రగడ సూచించారు. పచ్చపార్టీని సపోర్టు చేసే టీవీ ఛానళ్లు మీ కుటుంబాన్ని అవమానించిన విషయంలో అందరం బాధపడుతున్నామన్నారు. ఇలాంటిది ఎవరికి జరిగినా అందరూ ఖండించాలన్నారు.
ఏ దారి లేక అడుక్కున్నారు
2014లో ఏ దారి లేక జాతిని, మిమ్మల్ని అడుక్కొని అధికారం చేపట్టి ఆ తర్వాత ఒక్కో వర్గాన్ని అణిచివేస్తూ వస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. దళితులపై, అణగారిన వర్గాలపై నిత్యం దాడులు చేయిస్తున్నారని, ఘోరమైన బూతులు తిడుతూ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కాపు రిజర్వేషన్ మద్దతుకు చిరంజీవి, దాసరి నారాయణ రావు మద్దతు పలకడంతో ఆనందించానని చెప్పారు.
24 గంటలు కష్టపడి టీడీపీని సముద్రంలో పాతిపెట్టు
తెలుగుదేశం పార్టీని సముద్రంలో కలిపేందుకు 24 గంటలు కష్టపడాలని పవన్ కళ్యాణ్కు ముద్రగడ సూచించారు. పవన్ తన కుటుంబానికి జరిగిన అవమానం విషయమై కేసు పెట్టి కోర్టుకు వెళ్లాలనే ప్రయత్నంతో ఆపవద్దన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలన్నారు. టీడీపీని సముద్రంలో పాతిపెట్టాలన్నారు.
మీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనుక కుట్ర!
ఎదుటివారి తల్లిదండ్రులు, భార్యా, పిల్లలను టీవీ వాళ్లు అవమానిస్తారని, ఇలా అవమానించిన వారికి తల్లిదండ్రులు, భార్యా పిల్లలు లేరా అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ఉన్న గౌరవం ఇతరుల కుటుంబాలకు ఉండదా అన్నారు. దీనికి పూర్తి కారణం వారి వెనుక ఉన్నవారు పాపపు సొమ్ముతో, మదమెక్కి ఇటువంటివి ప్రోత్సహించడమే అన్నారు. ఇలాంటివి గతంలో అసెంబ్లీలో జరిగినప్పుడు వారికి బాధ, ఇతరులకు కూడా ఇటువంటి బాధ ఉంటుందన్న సంగతి తెలిసి కూడా ప్రోత్సహించడం చాలా తప్పు అన్నారు. అలా ప్రోత్సహించడానికి కారణం నిత్యం ఇటువంటి అవమానాలతో మీరు (పవన్ కళ్యాణ్) ఇల్లు కదలకుండా కుట్ర చేస్తున్న సంగతి గమనించాలన్నారు.
ఆ ఆలోచన చేయకండి
మీ కుటుంబానికి జరిగిన అవమానం గురించి కేసు పెట్టి, అరెస్టు చేయించారని, కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని విన్నానని, ఆ ప్రయత్నం చేయకండి అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. వారి పార్టీని కాలువ, చెరువు, గోదావరిలో కలపడానికి ప్రయత్నించవద్దని, సముద్ర గర్భంలో కలపాలన్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజలు దీపావళి చేసుకునేలా కష్టపడాలన్నారు.