ఏపీసీఎం వైఎస్ జగన్ కు, తెలంగాణా సీఎం కేసీఆర్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ.. విషయమిదే!!
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం తర్వాత, చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభం తన లేఖతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వరుసగా ముద్రగడ పద్మనాభం లేఖలు రాయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న ప్రధాని నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన విధంగా రద్దు చేసుకోవాలని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని దేశంలోని ఇతర పరిశ్రమలతో పోల్చి చూడొద్దని లేఖ రాశారు.
ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రెండు రాష్ట్రాల సీఎం లకు ముద్రగడ లేఖ
ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తాజాగా ముద్రగడ పద్మనాభం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన బహిరంగ లేఖలో ఈసారి రైతుల సమస్యలను పేర్కొంటూ, రైతుల సమస్యలను పరిష్కరించాలని, అన్నదాతలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ముద్రగడ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలకు రైతుల వెన్నుముక విరిగిపోయిందని, రైతులు పండించిన ధాన్యం తడిసి పోయిందని.. ఇక ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రవర్తించాలని లేఖలో పేర్కొన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని విజ్ఞప్తి
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోండి అని ముద్రగడ పద్మనాభం లేఖలో విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యం నుండి ఆల్కహాల్ స్పిరిట్ తయారు చేయడానికి ఆస్కారం ఉంటుందని లేఖలో పేర్కొన్న ముద్రగడ, జిల్లాకు ఒకటి చొప్పున ధాన్యం నుంచి ఆల్కహాల్ స్పిరిట్ తీసే డిస్టిలరీ ఏర్పాటు కావాలని, తద్వారా ధాన్యం తడిసినా రైతులకు మద్దతు ధర వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో తన వద్దకు ఈ ప్రతిపాదనలు వచ్చాయని ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.
తడిసిన ధాన్యం నుండి ఆల్కాహాల్ స్పిరిట్ డిస్టలరీలు ఏర్పాటు చేస్తే రైతులకు నష్టాలు రావు
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ధాన్యం నుంచి స్పిరిట్ తయారుచేసే డిస్టిలరీలు ఏర్పాటు చేస్తే రైతులకు నష్టాలు రావని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులకు కొంత ఆందోళన తగ్గుతుందని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. వరి సాగు చెయ్యొద్దని, వాణిజ్య పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెప్పటం సరికాదని ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు. నీరు అధికంగా ఉండే భూములలో వరి తప్ప వాణిజ్య పంటలను సాగు చేయడానికి ఆస్కారం ఉండదని ఇరు రాష్ట్రాల సీఎంల దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. రైతుల సమస్యలను అర్థం చేసుకొని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముద్రగడ పద్మనాభం కోరారు.
ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే ... వారి పరిస్థితి అర్ధం చేసుకుని ఆదుకోండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోలు విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొందని పేర్కొన్న ముద్రగడ పద్మనాభం వివిధ మార్కెట్లలో రైతులు ధాన్యం బస్తాలతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల రోడ్లమీద, కల్లాలలో వరి ధాన్యం దర్శనమిస్తోంది అని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు ముద్రగడ బహిరంగ లేఖ రాసి రైతుల సమస్యలను అర్థమయ్యేలా చెప్పారు.