వైసీపీలోకి ముద్రగడ: జగన్ బంపరాఫర్: ఆ ఇద్దరే లక్ష్యంగా సీఎం అడుగులు..!
కాపు ఉద్యమ నాయకడు ముద్రగడ వైసీపీలో చేరటం ఖాయమైంది. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం కొనసాగిస్తున్న ముద్రగడ పద్మనాభం ఎన్నికలవేల సైలెంట్గా ఉన్నారు. కాపు వర్గం మొత్తం పవన్ కళ్యాన్కే మద్దతుగా నిలుస్తారని కొంత మంది..కేంద్రం ఆమోదించిన అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇవ్వటంతో వారంతా చంద్రబాబు వైపే ఉంటారని మరి కొందరు అంచనా వేసారు. అయితే, అనూహ్యంగా కాపుల్లో అధిక శాతం వైసీపీకే పట్టం కట్టారు. ఇక, భవిష్యత్ సమీకరణాలే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు.
వైసీపీలోకి ముద్రగడ..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో అధికారికంగా చేరనున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత దీని పైన ఒత్తిడి పెంచేందుకు ముద్రగడ పద్మనాభం తుని వద్ద కాపుల సభ ఏర్పాటు చేసారు. అది హింసకు దారి తీసి రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం అయింది. ఆ తరువాత దీని పై ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల పైన అధ్యయనం కోసం మంజునాధ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయంలో విభేదాలు వచ్చాయి. సభ్యులు రిజర్వేషన్కు అనుకూలంగా నివేదిక ఇవ్వగా..ఛైర్మన్ వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. ఆ తరువాత అగ్రవర్ణాల పేదల కోటాలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ సమయంలోనూ స్పందించని ముద్రగడ పద్మనాభం ఎన్నికల వేళ..మౌనంగానే ఉన్నారు. తాజాగా ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించారు.
ఎన్నికల్లో వైసీపీకి సహకరించారా..
ఇక, ఉభయ గోదావరి జిల్లాతో పాటుగా విశాఖ..కృష్ణా..గుంటూరు జిల్లాల్లో కాపులు ఏ పార్టీ గెలవాలన్నా..ఓడినా ఆ వర్గం ఓట్లే కీలకం. అయితే, పవన్ కళ్యాన్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో గణనీయ ప్రభావం చూపు తుందని..మెజార్టీ కాపు ఓటింగ్ జనసేనకే వెళ్తుందని అంచనా వేసారు. అదే సమయంలో తాము కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇవ్వటంతో పాటుగా ఆర్దికంగా తోడ్పాటు అందించామని తప్పకుండా వారంతా తమతోనే ఉంటారు అని టీడీపీ ఆశించింది. జగన్ కాపు రిజర్వేషన్ పైన స్పష్టమైన హామీ ఇవ్వలేదని దీంతో..వైసీపీకి కాపు వర్గం ఓట్లు పడవ ని టీడీపీ లెక్కలు వేసింది. అయితే, అనూహ్యంగా కాపు మెజార్టీ ఓటింగ్ వైసీపీకే అనుకూలంగా సాగింది. అధిక నియోజకవర్గాల్లో గెలుపొందింది. తాజా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దుల గెలుపు కోసం ముద్రగడ సహకరించారని.. ఆయన వైసీపీ అభ్యర్దులకు మద్దతుగా ఓట్లు వేయించారని చెబుతున్నారు.
జగన్ బంపరాఫర్..
కాపు ఉద్యమ కారుడిగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన పార్టీలో చేరిన తరువాత జగన్ బంపరాఫర్ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. కాపు కార్పోరేషన్కు ఏటా పదివేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆయన కోరుకుంటే కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వటానికి సిద్దంగా ఉన్నట్లు జగన్ హమీ ఇచ్చారు. భవిష్యత్లో రాజ్యసభలో వైసీపీకి అవకాశం వస్తుందని..ఆ సమయంలో ముద్రగడకు స్థానం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుండి రాజ్యసభలో ఉన్న ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావటంతో ముద్రగడకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ..జనసేకు కాపు వర్గాన్ని పూర్తిగా దూరం చేసేందుకు 2024 ఎన్నికలే లక్ష్యంగా మరిన్ని నిర్ణయాలు..బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్లు సమాచారం.