ముద్రగడ పద్మనాభంతో కొణతాల రామకృష్ణ భేటి...కొత్త పార్టీ పెడుతున్నారా?
విశాఖపట్టణం: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మరిన నేపథ్యంలో బలమైన సామాజిక వర్గాలకు ఇద్దరు నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఎపి రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ పెట్టే అంశాలపై వారిరువురూ సుదీర్ఘ చర్చ జరిపినట్లు ప్రాధమిక సమాచారం. ఉత్తరాంధ్ర సీనియర్ నేత అయిన కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరుతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 20 న ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ధర్మ పోరాట దీక్షకు కొణతాల రామకృష్ణ హాజరుకావడంతో ఇక ఆయన టిడిపిలో చేరడం లాంఛనమే నని అందరూ భావించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును ధర్మ పోరాట దీక్షలో కలిసిన కొణతాల రామకృష్ణ హోదా సాధనకు సీఎం ధర్మ పోరాట దీక్షకు దిగడం అభినందనీయమన్నారు. ఒక పౌరుడిగా ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. హామీల అమలు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, ఇందులో పిటిషనర్గా ముఖ్యమంత్రే ఉండాలని కొణతాల సూచించారు.
అయితే ఈ క్రమంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా కొణతాల రామకృష్ణతో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక గుర్తింపు ఉండగా సాత్వికుడిగా,విశ్వసనీయవ్యక్తిగా గుర్తింపుపొందిన కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేత కావడం గమనార్హం. గవర సామాజిక వర్గంలో కులం కట్టుబాట్లు గట్టిగా పాటిస్తారు. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలన్నా కుల పెద్దల అనుమతి అవసరం. అయితే ఒకే మాటకు కట్టుబడి ఉండే వైఖరి అత్యధికులది.
ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నేతలు సమావేశం అవడం ప్రస్తుత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ తమ సామాజిక వర్గాలకు అండగా ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టడం ఉత్తమమనే ఆలోచనతో ఆ విషయమై చర్చించేందుకు ఈ ఇరువురు నేతలు భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే వీరి సమావేశం ముఖ్యాంశాలను ఈ ఇరువురు నేతలే మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.