దూసుకెళ్తున్న ముద్రగడ-కాకినాడలో బాబు: భారీగా మోహరించిన పోలీసులు
పోలీసులు ముందుకు కదలనీయకపోవడంతో నిలిచిపోయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రం ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. భారీగా మద్దతుదారులు కదలిరావడంతో ఎట్టకేలకు ఆయన తన ఇంటి నుంచి ముందుకు సాగారు.
తూర్పుగోదావరి: పోలీసులు ముందుకు కదలనీయకపోవడంతో నిలిచిపోయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రం ఆదివారం మళ్లీ ప్రారంభమైంది. భారీగా మద్దతుదారులు కదలిరావడంతో ఎట్టకేలకు ఆయన తన ఇంటి నుంచి ముందుకు సాగారు. తన నివాసం నుంచి బయలుదేరిన ముద్రగడ రాజుపాలెం మీదుగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేసేందుకు ముద్రగడ ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు.

కాపు ఉద్యమంపై చంద్రబాబు ఎందుకు ఉక్కుపాదం మోపుతున్నారని ముద్రగడ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కాగా, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావడంతో వారితో కలిసి ముద్రగడ ముందుకు కదిలారు. ముద్రగడ వెంట భారీగా మద్దతుదారులు ఉండటంతో పోలీసులు కూడా చేతులెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో ముద్రగడ మొదట 'ఛలో కిర్లంపూడి'కి పిలుపునిచ్చారు. తన మద్దతుదారులంతా కిర్లంపూడికి తరలిరావాలని.. ఆ తర్వాత అక్కడి నుంచి ఛలో అమరావతి పాదయాత్ర చేపడుదామని ముద్రగడ తన అనుచరులకు సూచించారు. భారీ మద్దతుదారుల నడుమ ఆయన పాదయాత్ర రాజుపాలెం చేరుకున్నారు.
కాగా, కాకినాడలో సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో ముద్రగడ పాదయాత్ర చేస్తుండటం కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా మోహరించిన పోలీసులు ముద్రగడను మరోసారి అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications