'అప్పట్లో ఓ అర్థరాత్రి.. బాలకృష్ణ కోసం వైఎస్ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు'
నంబర్ ప్లేటు కూడా లేని కారులో చంద్రబాబు అర్థరాత్రి వైఎస్ ఇంటికెళ్లారని చెప్పారు. కేసు నుంచి బాలకృష్ణను బయటపడేయడానికి వైఎస్ తో బతిమాలుకున్నారని ముద్రగడ అన్నారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వెనక జగన్ ఉన్నారన్న టీడీపీ ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో.. గతంలో చంద్రబాబు వైఎస్ కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, కాపు ఉద్యమం కోసం అన్ని వర్గాల మద్దతును కూడగట్టే పనిలో ముద్రగడ నిమగ్నమైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం ఆయన చిత్తశుద్దిని శంకిస్తూనే ఉంది. ముద్రగడ వెనుక జగన్ ఉన్నారని తొలినుంచి ఆరోపిస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో ముద్రగడ మరోసారి ఆ ఆరోపణలపై స్పందించారు. కాంగ్రెస్ నేత చలమలశెట్టి రమేశ్బాబు నివాసాల్లో కాపు నేతలతో సమావేశమైన ముద్రగడ, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కాపు ఉద్యమం వెనక జగన్ హస్తం ఉందన్నది టీడీపీ నేతల దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు.
ఉద్యమాన్ని నడపడం కోసం జగన్ సహాయం కోరాల్సిన అవసరం తనకు లేదని ముద్రగడ స్పష్టం చేశారు. అదే సమయంలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కాల్పుల కేసులో బావమరిది బాలకృష్ణను రక్షించేందుకు అప్పట్లో వైఎస్ కాళ్లు పట్టుకుని మరీ చంద్రబాబు బ్రతిమాలుకున్నారని విమర్శించారు.
అదే విషయాన్ని వివరిస్తూ.. ఆ సందర్బంలో నంబర్ ప్లేటు కూడా లేని కారులో చంద్రబాబు అర్థరాత్రి వైఎస్ ఇంటికెళ్లారని చెప్పారు. కేసు నుంచి బాలకృష్ణను బయటపడేయడానికి వైఎస్ తో బతిమాలుకున్నారని ముద్రగడ అన్నారు.
ఓవైపు విమర్శిస్తూనే మరోవైపు చంద్రబాబుపై పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు ముద్రగడ. జ్యోతిబసు తర్వాత అంతటి అపార అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబేనని ఆయన ప్రశంసించారు. కాపు రిజర్వేషన్ల హామి నెరవేర్చకుంటే మరోసారి ఉద్యమం రగలడం ఖాయమని తేల్చి చెప్పారు.