ముద్రగడ దీక్ష ప్రారంభం: నా ప్రాణం నా జాతికే అంకితం, కాపులకు వినూత్న పిలుపు
కిర్లంపూడి: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్తో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శక్రవారం ఉదయం 8.30 గంటలకు ఆమరణ నిరాహారీ దీక్షకు దిగారు. తుర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన ఇంటిలో ఆయన సతీసమేతంగా దీక్షను ప్రారంభించారు.
దీక్ష ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం స్పందించే వరకూ తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ముద్రగడ పద్మనాభం అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ భార్యతో కలిసి తాను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
‘‘నా ప్రాణం నా జాతికే అంకితం. కాపులకు రిజర్వేషన్లు దక్కేదాకా నా పోరాటం ఆగదు. నా దీక్షకు సంఘీభావంగా ఏ ఒక్కరు కిర్లంపూడి రావద్దు. మీ ఇళ్లల్లోనే సంఘీభావంగా మధ్యాహ్నం భోజనం మానండి. ప్లేటుపై గరిటెతో కొట్టండి. ఆ శబ్దం సీఎం చెవిలో పడాలి. ఆ శబ్దం విని అయినా సీఎం మనకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. తుని ఘటనలో కాపులపై నమోదైన కేసులను పోలీసులు బేషరతుగా ఎత్తివేయాలి.'' అని ముద్రగడ భావోద్వేగంతో మాట్లాడారు.
బీసీలను కాపుల్లో చేర్చాలనే డిమాండ్తోనే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. తన డిమాండ్లను నెరవేర్చే వరకు తన దీక్ష కొనసాగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలు ఎవరూ ఇక్కడకి రావద్దని విజ్ఞప్తి చేశారు. నేను జాతికి అంకితమైనప్పుడు, నాకు ఎలాంటి రక్షణ అవసరం లేదన్నారు.
ఒంటరిగానైనా దీక్ష చేస్తానన్న చెప్పిన ముద్రగడ, ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కిర్లంపూడికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇలా చెబుతున్నానన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామం మధ్యాహ్నాం పూట భోజనం మానేసి నిరసన తెలియజేస్తే బాగుంటుందన్నారు.
తన దీక్షకు ఎవరైనా మద్దతు తెలియజేయాలనుకుంటే మీ ఇంటి ముందున్న వీధిలో పళ్లెంపై గరిటెతో కొట్టి నిరసన తెలియజేయాలన్నారు. మీరు కొట్టే చప్పుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినబడి తమ జాతికి న్యాయం చేస్తారని అభిప్రాయపడుతున్నానని చెప్పారు. గాంధేయ మార్గంలో తమ నిరసన కొనసాగుతుందన్నారు.
తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, నాకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. నా సోదరులు ఇక్కడికి వచ్చి తనన్ని పరామర్శించి వెళ్లిపోతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగజేయవద్దని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షతో కిర్లంపూడి సమీప గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
దీక్ష చేస్తానని పోలీసులకు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పోలీసులు కూడా ముద్రగడ దీక్షను విరమించుకోవాలని సూచించారు. తునిలో కొబ్బరి తోటల్లో ఇటీవల జరిగిన ‘కాపు ఐక్య గర్జన' హింసాత్మకంగా మారిన నేపథ్యంలో నేటి ముద్రగడ దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తూర్పుగోదావరి జిల్లా మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
జాతీయ రహదారిపై పలు సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తుని, తొండంగి, కోనందూరు, తేటగుంట, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆరుగురు డీఎస్పీలు, 24మంది సీఐలు, 50మంది ఎస్సైలు 200మంది ఏఎస్సైలు, 700 మంది కానిస్టేబుళ్లు, వెయ్యిమందికి పైగా పారామిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆర్ఏఎఫ్, సీఆర్పీఎఫ్లతో పాటు సుమారు 2వేల మందిగా పోలీసులు మోహరించారు. మరోవైపు ముద్రగడ దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆయన ఇంటికి అభిమానులు చేరుకుంటున్నారు. జిల్లాలోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన సొంతింటిలో భార్యతో కలిసి ముద్రగడ ఆమరణ దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాపుల నుంచి భారీ ఎత్తున సంఘీభావం వ్యక్తం కానున్న నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.