కాపు భవనాలకు చంద్రబాబు పేరేంటీ?: తొలగించండంటూ ముద్రగడ లేఖ
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మరో లేఖను రాశారు. కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కాపు భవనాలకు చంద్రబాబు నాయుడి పేరు పెట్టడాన్ని కూడా ఆయన తప్పబట్టారు.
కాపు భవనాలకు 'చంద్రన్న' పేరుని వెంటనే తొలగించాలన్నారు. తన దీక్షకు మద్దతు తెలిపిన వారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పిన ముద్రగడ భవిష్యత్తులో దీక్ష చేస్తే వారి మద్దతు తప్పక కోరతానని అన్నారు. కాపు సంక్షేమ నిధికి ఎవరైనా నిధులు ఇవ్వొచ్చంటున్న బాబు, పన్నుల రూపంలో కాపులు రూ.కోట్లు చెల్లించడం లేదా అని ప్రశ్నించారు.
కాపులను బీసీల్లో చేరుస్తూ రిజర్వేషన్లు కల్పించే తీర్మానాన్ని ఆగస్టులోగా పార్లమెంట్కు పంపాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని 9వ షెడ్యూల్లో చేర్చే అంశం పక్కనపెట్టే ఆలోచన చేయవద్దని లేఖలో కోరారు.
కాపుల్లో పేదలకు రుణాల మంజూరుపై సమీక్షించాలని ఆయన కోరారు. సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని ముద్రగడ కోరారు. ఏ పార్టీతో నిమిత్తం లేకుండా రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు చంద్రన్న పేరు పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్లో కాపుల ఇంటిపేర్లు తొలగించి చంద్రన్నకాపు అని పేరుపెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ నిధుల నుంచి ఖర్చు చేయకుండా, చివరకు కాపులను అడుక్కునే వారిగా చూపడం ఎంతవరకు న్యాయమన్నారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సంతోషిస్తామని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. కాపు భవనాలకు తన పేరు పెట్టుకోవాలనన్న చంద్రబాబు నిర్ణయంపై వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇలాంటి సమయంలో చంద్రబాబుకు ముద్రగడ లేఖ రాయడం పెద్ద చర్చనీయాంశమైంది. అంతేకాదు తమ కుల భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడం ఏంటని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కాపు నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
కాపు కులస్తుల భవనాలకు కమ్మ సామాజికి వర్గానికి చెందిన చంద్రబాబు పేరు పెట్టడం ద్వారా ఏం సంకేతాలను పంపుతున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఈ విషయమై ఆదివారం కాపు నేతలు కొంతమంది చంద్రబాబును కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
కాపు భవనాలకు మీ పేరు పెట్టుకుంటే కాపుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, కాబట్టి కాపు నాయకుల పేర్లే భవనాలకు పెట్టాలని సూచించారు. అలా చేయని పక్షంలో కాపులంతా టీడీపీకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉందని చెప్పారంట.
చంద్రబాబు వద్ద కొందరు నేతలు పలుకుబడి సాధించేందుకు ఇలా కుల ప్రయోజనాలను తాకట్టు పెట్టండ బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు నేతలు ఇలా నేరుగా వచ్చి కాపు భవనాలకు 'మీ పేరు పెట్టవద్దు' అని కోరే సరికి చంద్రబాబు కూడా అవాక్కయ్యారని సమాచారం.
తన ఆమోదం తీసుకోకుండా... తనకు తెలియకుండా తన పేరుని పథకాలకు పెట్టవద్దని అధికారుల వద్ద చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇకపై పథకాలకు పేర్లు పెట్టే ముందు సీఎం కార్యాలయం అనుమతి తీసుకోవాలంటూ సీఎంఓ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెడితే తప్పేంటని ఎమ్మెల్యే బోండా ఉమ ప్రశ్నించారు. కాపునాడు, కాపు సంఘాల కోరిక మేరకే చంద్రన్న పేరు పెట్టామని చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే చేశామని, దీనిని కొంతమంది రాజకీయం చేస్తుండటం తగదన్నారు.
మరోవైపు కాపుల సంక్షేమానికి ఎంతో పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరును ఆయా పథకాలకు పెట్టడంలో తప్పులేదని మంత్రి నారాయణ అన్నారు. ఈ విషయమై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి చంద్రబాబు రూ.1,000 కోట్లు ఇచ్చారన్నారు.
ఈ స్థాయిలో నిధులు ఎవరూ ఇవ్వలేదన్నారు. ఈ నిధులతో కాపుల ఆర్థిక వృద్ధి ఎన్నో రెట్లు మెరుగుపడుతుందన్నారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మంజునాథ కమిషన్ను కూడా వేశారని, ప్రస్తుతం కమిషన్ తన పని చేస్తోందన్నారు.